Breaking News

ఫీజు కట్టలేదని యువతిని గెంటేసిన కాలేజీ యాజమాన్యం.. 150 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించి


కాలేజీ ఫీజు చెల్లించలేదన్న కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యం విద్యార్థినిపై పైశాచికంగా ప్రవర్తించింది. ఫీజు మొత్తం కడితేనే లోనికి అనుమతిస్తామంటూ హాస్టల్‌లో సైతం అడుగుపెట్టనివ్వలేదు. దీంతో ఆ యువతి ఒంటరిగా 150 కిలోమీటర్ల ప్రయాణించి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆయన తన కూతురికి న్యాయం చేయాలంటూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డి.దీప్‌సింగ్‌ తన కుమార్తె కీర్తనను చైతన్యపురి డివిజన్‌ పరిధిలోని వికాస్‌నగర్‌లో ఉన్న ఎక్సెల్‌ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్‌ బైపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించాడు. ఇప్పటివరకు రూ.25 వేల వరకు ఫీజు చెల్లించాడు. సంక్రాంతి సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వెళ్లిన కీర్తన ఆదివారం (జనవరి 19) తిరిగి హాస్టల్‌కి చేరుకుంది. తండ్రి ఫీజు నిమిత్తం ఇచ్చిన రూ.10వేలు కౌంటర్‌లో కట్టేందుకు వెళ్లగా సిబ్బంది దుర్భాషలాడారు. ఫీజు రూ.40వేలు కట్టాల్సి ఉండగా.. రూ.10వేలే ఎలా కడతారని కీర్తనను నిలదీశారు. తన తండ్రి అంతే ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని మళ్లీ కడతానని చెప్పినా వినిపించుకోలేదు. మొత్తం రూ.40వేలు చెల్లించకపోతే వెళ్లిపోవాలని దూషిస్తూ ఆమెను కాలేజీతో పాటు హాస్టల్‌ నుంచి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కీర్తన ఒంటరిగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి వెళ్లింది. కాలేజీ యాజమాన్యం నిర్వాకంపై మండిపడిన దీప్‌సింగ్ సోమవారం కూతురిని వెంటబెట్టుకుని హైదరాబాద్ చేరుకుని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫీజులు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ కాలేజీ యాజమాన్యం తన కూతురిని నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపేసిందని, కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమకు న్యాయం జరగకపోతే ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.


By January 21, 2020 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-inter-college-management-dont-allow-girl-student-in-hostel-over-fee-issue/articleshow/73474902.cms

No comments