Breaking News

చైనా: 132కి చేరిన‘కరోనా’ మృతులు.. 6 వేలమందికి వైరస్


మహమ్మారితో చైనా అతలాకుతలమవుతోంది. వుహాన్ నగరంలో మొదలైన ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా చైనాలో మృతిచెందినవారి సంఖ్య 132కి చేరుకుంది. ఇప్పటి వరకు 6వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడినట్టు చైనా తెలిపింది. దీంతో చైనాలోని తమ పౌరులను తక్షణమే అక్కడ నుంచి రప్పించే ప్రయత్నాలను వివిధ దేశాలు ప్రారంభించాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల్లోనే ఏకంగా 72 మంది చనిపోవడంతో వైరస్ ఎంత ప్రమాదంగా పరిణమించిందో అర్ధమవుతోంది. గడచిన 24 గంటల్లోనే 26 మంది చనిపోవడం మరింత కలవరానికి గురిచేస్తోంది. సోమవారం 1,771 కేసులు నమోదు కాగా, మంగళవారం దాని సంఖ్య 1,459గా ఉంది. దీంతో చైనాలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 5,974కు చేరింది. ఒక్క హుబే ప్రావిన్సుల్లోనే మంగళవారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, వుహాన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. తరలింపు ప్రక్రియలో సహకరించాల్సిందిగా చైనాను లాంఛనంగా కోరింది. అలాగే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధతపై క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా మంగళవారం సమీక్ష నిర్వహించారు. వుహాన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. చైనా ప్రభుత్వంతో అక్కడ భారత రాయబార కార్యాలయ సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఇందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. జపాన్ కూడా తన పౌరులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తోంది. వుహాన్ నుంచి 206 మంది పౌరులను మంగళవారం తరలించగా, వారిలో కొందరికి జలుబు, జ్వరం లక్షణాలు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. వీరిని టోక్యో హాస్పిటల్‌లో చేర్పించి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందజేస్తున్నారు. చైనాలోని 4వేలకుపైగా జపాన్ పౌరులు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ను షి జిన్‌పింగ్‌ పిశాచంతో పోల్చారు. దీన్ని నియంత్రించే విషయమై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టేడ్రోస్‌ అధనామ్‌తో జింగ్ పింగ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టేడ్రోస్‌ మాట్లాడుతూ.. వుహాన్‌ నగరం నుంచి వివిధ దేశాలు తమ పౌరులను తరలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడం లేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు.


By January 29, 2020 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-virus-killed-132-people-and-infected-more-than-6000-in-china/articleshow/73719826.cms

No comments