Breaking News

పాక్ గూఢచారులు దేశంలోకి చొరబడొచ్చు.. పౌరసత్వ బిల్లుపై నిఘా సంస్థల ఆందోళన


పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన హింసకు గురై దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, విపక్షాలు బలంగా వ్యతిరేకిస్తున్నా లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును నేడు రాజ్యసభ్యలో ప్రవేశపెడుతున్నారు. అయితే, కొత్త సవరణలను శత్రువులు తమ అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ () ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ తన ఏజెంట్లను భారత్‌లో పంపించేందుకు ఈ బిల్లును ఉపయోగించుకునే అవకాశముందని భావిస్తున్నాయి. పౌరసత్వ బిల్లుపై గతంలో వేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు ఐబీ, రా ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎన్‌డీయే ప్రభుత్వం 2016లోనే పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించగా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జేపీసీని నియమించారు. ఈ సందర్భంగానే ఐబీ, రా ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. మతపరమైన హింసను సాకుగా చూపి దశాబ్దాల క్రితమే పలువురు మనదేశంలోకి శరణార్థులుగా ప్రవేశించారని, వారు చూపిన కారణం సహేతుకమనదనే సంగతిని ప్రస్తుతం నిర్ధారించుకోవడం కష్టమని ఐబీ తెలిపింది. ఇటీవలి కాలంలోనే వచ్చిన వ్యక్తుల గురించి ఆయా దేశాల్లో పరిస్థితుల తీవ్రతను మీడియా ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. శరణార్థుల దరఖాస్తులపై ఫారినర్స్ రిజిస్ట్రార్ ఆఫీసు ఆధ్వర్యంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విదేశాల్లో మతపరమైన హింసను కారణంగా చూపుతూ ఇప్పటివరకు 31,313 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. వీరిలో హిందువులు 25,447 మంది, సిక్కులు 5,807 మంది, క్రిస్టియన్లు 55 మంది, పార్శీలు, బౌద్ధులు ఇద్దరు ఉన్నట్టు తెలిపింది. శత్రు దేశాల నిఘా సంస్థలు తమ ఏజెంట్లు, సానుభూతిపరులను దేశంలోకి పంపేందుకు పౌరసత్వ బిల్లును పావుగా ఉపయోగించుకునే అవకాశముందని ‘రా’ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి పరిణామాలు దేశ భద్రతకు ప్రతికూలంగా మారే అవకాశముందని వివరించింది. పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక, 2016 నాటి ప్రతిపాదిత బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో గట్టెక్కలేపోయింది. ఈ సమయంలో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడంతో బిల్లు మురిగిపోయింది. దీంతో తాజాగా కేంద్రం బిల్లును ప్రతిపాదించింది. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి దేశంలోకి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొంది.


By December 11, 2019 at 12:51PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/intelligence-agencies-worried-about-citizenship-amendment-bill-2019/articleshow/72469797.cms

No comments