Breaking News

పిజ్జా ఆర్డర్‌ చేస్తే.. రూ. 95 వేలు మాయం!


ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదివారం ఫుడ్ యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశారు. ఎన్ని గంటలు ఎదురుచూసినా పిజ్జా డెలివరీ కాకపోవడంతో యాప్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. ఆ టెకీ చేసిన ‘పాపం’ ఇదే..! అదను కోసం ఎదురు చూసిన సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. టెకీకి సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని తస్కరించి రూ. 95 వేలు కాజేశారు. కర్ణాటక రాష్ర్ట రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి..బెంగళూరులోని కోరమంగళ 1వ బ్లాక్‌లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షేక్ డిసెంబర్ 1న మధ్యాహ్నం ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే డబ్బులు కూడా చెల్లించారు. అయితే ఎన్ని గంటలు ఎదురు చూసినా పిజ్జా రాకపోవడంతో యాప్‌కు చెందిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశారు. ఇదే షేక్ చేసిన తప్పయిపోయింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన వ్యక్తి తాము పిజ్జాలను హోం డెలివరీ చేయడం లేదని, కావాలంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని నమ్మబలికాడు. ఇందుకు ఒక వెబ్ లింక్‌ను కూడా షేర్‌ చేశాడు. ఆ లింక్‌ ఓపెన్ చేసి ఫోన్‌ పే, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలని సూచించాడు. ఆ మోసగాడి వలలో పడిన షేక్ తూ.చా తప్పకుండా చెప్పినట్టే బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేశారు. సరిగ్గా ఈ అదనుకోసం చూస్తున్న కేటుగాళ్లు షేక్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ.45 వేలు, ఆంధ్రా బ్యాంక్ ఖాతా నుంచి రూ.50 వేలు మొత్తం రూ.95 వేలు కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన షేక్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలాంటి కేసులు తమ వద్దకు చాలా వస్తున్నాయనీ, నకిలీ వెబ్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.


By December 06, 2019 at 12:24PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/techie-orders-food-cyber-criminals-cheat-him-95000-rupees/articleshow/72396146.cms

No comments