Breaking News

నేడు రాజ్యసభకు క్యాబ్ 2019.. టీడీపీ, వైసీపీ అనుకూలంగా ఓటేస్తాయా?


కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాస్పద బిల్లుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఎన్‌డీఏ సర్కారు మాత్రం వెనక్కుతగ్గడం లేదు. రెండు రోజుల కిందట లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి.. పన్నెండు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం పొందింది. అయితే మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బుధవారం ఈ బిల్లును ముందుకు రానుంది. దీనిపై చర్చ కోసం ఆరు గంటల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నందున ఈ బిల్లును సులభంగానే ఆమోదం పొందింది. కానీ రాజ్యసభలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షాలు, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా కేంద్ర మాత్రం ఆమోదించాలనే పట్టుదలతో ఉంది. లోక్‌సభలో సుధీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు అనుకూలంగా 311 మంది ఓటు, వ్యతిరేకంగా 80 మంది ఓటువేశారు. అయితే, రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ కూటమికి బలాన్ని బట్టి చూస్తే బిల్లుకు ఆమోదం లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. బుధవారం మధ్యాహ్నం లంచ్‌ తర్వాత బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మిత్రపక్షం జేడీయూ సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. అలాగే లోక్‌సభలో మద్దతు ఇచ్చిన శివసేన సైతం చివరి నిమిషంలో మెలిక పెట్టింది. తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిపై స్పష్టత కావాలని ఆ పార్టీ తేల్చిచెప్పింది. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, వామపక్షాలు, టీఆర్ఎస్‌లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో బిల్లు గట్టెక్కుతుందా అనే అనుమానం నెలకుంది. అయితే, తమకు 125 నుంచి 130 వరకు సభ్యుల మద్దతు ఉందని బీజేపీ భావిస్తోంది. బీజేడీ, వైఎస్ఆర్‌సీపీ, టీడీపీతో పాటు ఏడుగురు స్వతంత్రులు సైతం బిల్లుకు మద్దుతుగా ఓటేస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. మొత్తం 240 మంది సభ్యులున్న రాజ్యసభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు గట్టెక్కాలంటే.... 123 మంది మద్ధతు కావాలి. వాస్తవంగా చూస్తే బీజేపీకి 80 మంది సభ్యులు, మిత్రపక్షాలతో కలుపుకుంటే ఆ బలం 116కి చేరుతుంది. బీజేపీకి ఇంకా ఏడుగురి మద్ధతు అవసరం. బీజేడీ, వైసీపీ బిల్లును స్వాగతించడంతో ఈ రెండు పార్టీల మద్దతు ఇస్తే బిల్లు రాజ్యసభలో సులువుగా గట్టెక్కుతుంది.


By December 11, 2019 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cab-2019-is-put-through-its-final-hurdle-with-the-rajya-sabha-taking-it-up-on-wednesday/articleshow/72465882.cms

No comments