Breaking News

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్ బ్యాగ్ లభ్యం.. హైఅలర్ట్!


ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌‌ను భద్రత సిబ్బంది గుర్తించారు. ఇందులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌ వద్ద ఒక బ్యాగ్‌‌ను రాత్రి ఒంటిగంట సమయంలో దళాలు గుర్తించాయి. సీఐఎస్‌ఎఫ్‌ బృందం సాయంతో ఆ బ్యాగ్‌ను మరో ప్రదేశానికి తరలించినట్టు తెలిపారు. ఆ బ్యాగ్‌‌లో అనుమానిత ఆర్డీఎక్స్, విద్యుత్తు తీగలు ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు సంజయ్‌ భాటియా పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాగులోని పదార్థాలను బాంబు స్క్యాడ్ సాయంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. లభ్యమైన పేలుడు పదార్థం 24 గంటలు పరిశీలనలో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మూడో టెర్మినల్‌లో కొంతసేపు ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు. విమానాశ్రయంలో పూర్తి తనిఖీలు నిర్వహించిన తరువాత ఉదయం నాలుగు గంటల నుంచి రాకపోకలకు అనుమతిచ్చారు. మూడో టెర్మినల్ నుంచే జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్ లభ్యం కావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 48 గంటల పాటు హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 31న జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీని ఉగ్రవాదులు హిట్ లిస్ట్‌లో చేర్చారన్న సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులకు కేంద్రం అప్రమత్తం చేసింది. ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలు, భవనాల వద్ద సాయుధ పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో బ్యాగు లభించడంతో ఆందోళన వ్యక్తంమవుతోంది.


By November 01, 2019 at 01:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rdx-found-in-bag-at-terminal-3-of-indira-gandhi-international-airport-in-delhi/articleshow/71850036.cms

No comments