Breaking News

నేటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. ఈసారీ అధికార పక్షానిదే ఆధిపత్యమా?


పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశంనిర్వహించారు. అఖిల పక్ష సమావేశానికి మొత్తం 27 పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 13 వరకు సాగుతాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సమావేశాలు అత్యంత ఫలప్రదం కావడంతో ఈసారీ అదే పంథా కొనసాగించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాగే, ఈ పార్లమెంటు సమావేశాల్లో 70వ రాజ్యాంగ దినోత్సవం, రాజ్యసభ 250వ సమావేశ ఉత్సవాలనూ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు, వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు సహా మరో 25 కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆర్థిక సంబంధ అంశాలు సహా సులభతర వాణిజ్యం, పన్నులు, ఆరోగ్యం, విద్యా తదితర కీలక అంశాలకు చెందిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సహకార సంఘాల్లో ప్రభుత్వ పాత్రను హేతుబద్దీకరించడం తోపాటు సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచేలా బహుళ రాష్ట్రాల సహకార సంఘాల (సవరణ)బిల్లు-2019ను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయనున్నారు. సహకార సంఘాల్లో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించాలన్నది ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ బిల్లు ఆమోదం పొందితే సహకార సంఘాలకు కేంద్ర రిజిస్ట్రార్‌‌ను నియమించడం, ఆ హోదాలో ఉన్న వారికి ఏ బహుళ రాష్ట్ర సహకార సంఘాన్నైనా ఖాయిలా పడ్డ సంఘంగా ప్రకటించే అధికారం ఉంటుంది. రిజిస్ట్రార్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు మధ్యంతర బోర్డును కూడా నియమించవచ్చు. గత సమావేశాల్లో కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370, 35ఎ ఎత్తివేతతోపాటు, ట్రిపుల్ తలాక్‌ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రతిపక్షాలపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఎన్డీయే సర్కారు, ఈసారీ ఆ పట్టు సడలకుండా ముందుకెళ్లడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. రామజన్మభూమి, రఫేల్‌ కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అధికారపక్షంలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. ఇక, 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబరు 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సెంట్రల్‌హాల్‌లో ఉభయసభల సంయుక్త సమావేశం జరుగుతుంది. రాజ్యసభ 250వ సభ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు.


By November 18, 2019 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/winter-session-of-parliament-from-today-onwards-modi-govt-to-push-citizenship-bill/articleshow/72101850.cms

No comments