ఎన్సీపీ ఎల్పీ సమావేశం.. శరద్ పవార్ వెంట 50 మంది ఎమ్మెల్యేలు!
అన్యూహ్యంగా బీజేపీకి మద్దతు పలికి మహారాష్ట్ర రాజకీయాల్లో పెను కుదుపునకు కారణమైన అజిత్ పవార్పై చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ శాసనసభా పక్ష పదవి నుంచి తొలగించారు. అధినేత శరద్ పవార్ నేతృత్వంలో శనివారం సాయంత్రం ఎన్సీపీ ఎల్పీ సమావేశం జరిగింది. అజిత్ను ఆ పదవి నుంచి తప్పిస్తూ మరో నేతను ఎన్నుకునే వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్కు రాజ్యాంగపరమైన హక్కులను దఖలుపరుస్తూ శాసనసభ్యులు తీర్మానించారు. అయితే, పార్టీకి చెందిన మొత్తం 54 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. శనివారం ఉదయం అజిత్ వెంట రాజ్భవన్కు వెళ్లి, ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా ఎన్సీపీని వీడబోమని, శరద్ పవార్కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎమ్మెలేలు కొందర్ని తన నివాసం నుంచి రాజ్భవన్కు తీసుకు వెళ్లిన ధనుంజయ్ ముండే కూడా ఎన్సీపీ ఎల్పీ సమావేశానికి హాజరుకావడం విశేషం. మరోవైపు, క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను భోపాల్కు తరలించగా, ఎన్సీపీ కూడా తన సభ్యులను శిబిరాలకు తరలిస్తోంది. ఇక, శివసేనతో కలవడాన్ని అజిత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి వెళ్దామనివారిలో అజిత్పవార్, సునీల్ తత్కారే, ధనుంజయ్ ముండేలు ఉన్నారు. ఇందులో అజిత్ పవార్, సునీల్ తత్కారేలపై అనేక కేసులున్నాయి. దివంగత నేత గోపీనాథ్ ముండే మేనల్లుడు ధనుంజయ్ ముండే మరాఠ్వాడాలో శక్తిమంతమైన యువనేత. ఈ ఎన్నికల్లో గోపీనాథ్ ముండే కుమార్తె పంకజను ఓడించారు. దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయనకు సత్సంబంధాలున్నాయి. బీజేవైఎంలో ఇద్దరూ కలిసి గతంలో పనిచేశారు. దీంతో ఆయన బీజేపీవైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అజిత్ పవార్, మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికి క్రమశిక్షణా రాహిత్యానికి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గలేదని, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణానికి 169-170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
By November 24, 2019 at 10:47AM
No comments