సర్కారీ మద్యం దుకాణాలు.. మొదటి రోజే షాకిచ్చిన ఉద్యోగి, చేతివాటం మామూలుగా లేదుగా..

దశలవారీగా మద్యపానం నిషేధం అమలు చేస్తామని మాటిచ్చిన జగన్ సర్కారు.. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచే రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఒక వ్యక్తికి గరిష్టంగా 3 మద్యం బాటిళ్లనే విక్రయిస్తున్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం దుకాణాల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 3500 సూపర్ వైజర్లు, 8033 మంది సేల్స్మెన్లను నియమించారు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమైన తొలి రోజే ఉద్యోగుల చేతి వాటం బయటకొచ్చింది. కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఎక్సైజ్ అధికారులకు షాకిచ్చింది. పెనమలూరులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలో తొలి రోజు రూ.2.03 లక్షల విలువైన మద్యాన్ని విక్రయించారు. అదే రోజు సాయంత్రం ఎక్సైజ్ అధికారులు డబ్బును తీసుకెళ్లడం కోసం వచ్చారు. కాగా మద్యం విక్రయించిన శివశంకర్ అనే ఉద్యోగి రూ.2.03 లక్షలకు బదులు రూ.1.61 లక్షలను మాత్రమే ఎక్సైజ్ సిబ్బందికి అప్పగించాడు. మద్యం స్టాక్, ఇచ్చిన నగదును పరిశీలించగా.. ఉద్యోగి చేతివాటం బయటకొచ్చింది. రూ. 42 వేలు తగ్గిందని ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. ఎక్కడో తేడా కొడుతుందని భావించిన సదరు ఉద్యోగి అక్కడి నుంచి ఉడాయించాడు. ఎక్సైజ్ సిబ్బంది పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారి సూచన మేరకు అతడి నుంచి రూ.42 వేలను రాబట్టారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించి.. శివశంకర్ స్థానంలో మరొకర్ని నియమించారు.
By October 04, 2019 at 09:21AM
No comments