Breaking News

గ్రామసచివాలయ ఉద్యోగాలు.. అభ్యర్థులకు షాకిస్తోన్న కండీషన్లు


జగన్ సర్కారు అధికారంలోకి రాగానే భారీ ఎత్తున ఉద్యోగాల నియామకంపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా వార్డు, గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. 20 లక్షల మందికిపైగా అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి మరీ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులందరికీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేశారు. దీంతో తమకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అర్హత సాధించిన అభ్యర్థులంతా ఆనందించారు. కానీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ వెనుక భాగంలో రాసిన కండీషన్లు చదివాక షాకయ్యారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్లో నిబంధనలు చదివాక కొందరు అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరాలా వద్దా అనే డైలమాలో ఉన్నామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం మొదటి రెండేళ్లు ప్రొబేషరీ పిరియడ్. ఉద్యోగానికి ఎంపికైన వారు తప్పనిసరిగా మూడేళ్లు పని చేయాలని నిబంధన విధించారు. ఈ మూడేళ్ల కాలంలో ఉద్యోగం మానేయాల్సి రావడం అనివార్యమైతే.. అప్పటి వరకూ అందుకున్న జీతాన్ని నయా పైసాతో సహా చెల్లించాలి. అంతే కాదు వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రభుత్వం చేసిన ఖర్చును కూడా తిరిగి ఇచ్చేయాలి. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు.. గ్రూప్స్ రాస్తున్న వారు ఈ ఉద్యోగాల్లో చేరాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. నోటిఫికేషన్‌లో రెండేళ్లు తప్పనిసరిగా పనిచేయాలని పేర్కొని.. అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో మాత్రం మూడేళ్లు కచ్చితంగా పని చేయాలనే నిబంధన విధించడం పట్ల అభ్యర్థులు అసహనంతో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రెండేళ్లలో ఏదైనా కారణంగా చూపి ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉండటం కూడా అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. గౌరవ వేతనంగా ఇచ్చేది నెలకు రూ.15 వేలు.. దానికి సవాలక్ష షరతులు.. ఇంతకు మించి మంచి ఉద్యోగం వచ్చి మానేద్దామంటే ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తామంటున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


By October 03, 2019 at 09:50AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-village-secretariat-jobs-selected-candidates-not-happy-with-the-govt-conditions/articleshow/71417249.cms

No comments