Breaking News

తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. 16 మంది సజీవదహనం


పాకిస్థాన్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. లాహోర్-కరాచీ మధ్య నడిచే తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లోని గ్యాస్ సిలెండర్ పేలి మంటలంటుకున్నాయి. దీంతో మూడు భోగీలు దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం 16 మంది సజీవదహనం కాగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్ష తగాత్రులను చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీగా మంటలు వ్యాపించి భోగీలు కాలిబూడిదయ్యాయి. మంటలను అదుపుచేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర భోగీలకు మంటలు వ్యాపించకుండా భోగీలను ఇంజిన్ నుంచి వేరుచేశారు. ఉదయం పూట ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తక్కువగా ఉంది. నాలుగు నెలల వ్యవధిలో పాక్‌లో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద రైలు ప్రమాదం ఇది. ఈ ఏడాది జులై 11న రైల్వే స్టేషన్‌లో ఓ ట్రాక్‌పై నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం పాలవగా.. 80 మంది వరకు గాయపడ్డారు. దక్షిణ పంజాబ్‌కు చెందిన సాదిఖాబాద్‌లోని వాల్హర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై నిలిపి ఉంచిన గూడ్స్‌రైలును అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చే సిగ్నల్‌లో పొరపాటు జరగడంతో అది గూడ్స్‌ రైలు నిలిపి ఉంచిన లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. దీంతో ఆ లైన్‌లో ప్రయాణించిన అక్బర్ ఎక్స్‌ప్రెస్.. ఆగి ఉన్న గూడ్సును ఢీకొట్టింది.


By October 31, 2019 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/several-people-killed-many-injured-in-fire-in-karachi-rawalpindi-tezgam-express-train/articleshow/71830729.cms

No comments