Breaking News

ఉల్లి రూ. 50, కొబ్బరి బోండా రూ.50, నిమ్మ కాయ రూ.10.. హైదరాబాద్‌లో రేట్ల తీరిది..


ఉల్లి మళ్లీ ఘాటెక్కింది. మార్కెట్లో నాణ్యమైన ఉల్లిపాయల ధర కిలో రూ.50 దాటింది. వర్షాల కారణంగా మార్కెట్‌కు రావడం తగ్గడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. క్వింటాల్ ఉల్లిపాయలు రూ.3000 నుంచి రూ.5000 వరకు పలుకుతున్నాయంటున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు హైదరాబాద్‌లో ఇళ్ల ముందుకొచ్చి మరీ రూ.50కి నాలుగు కిలోల చొప్పున ఉల్లిపాయలను విక్రయించారు. దాదాపు 45 రోజుల్లోనే ఉల్లి ధర భారీగా పెరగడం సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. ఒక్క ఉల్లిపాయే కాదు.. కొబ్బరి బొండం ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఒక్క కొబ్బరి బొండాను కనీసం రూ.30కు విక్రయిస్తున్నారు. వాటిలోనూ పెద్దగా నీళ్లు ఉండటం లేదు. నీళ్లుండే బొండాను రూ.50కి విక్రయిస్తున్నారు. లీటర్ కొబ్బరి నీళ్ల ధర రూ.120గా ఉంది. ఎండలు ఎప్పుడో తగ్గి.. వర్షాకాలం కూడా ముగుస్తున్నప్పటికీ కొబ్బరి బోండాల ధరలు తగ్గకపోగా.. పెరగడం గమనార్హం. కేరళ, బెంగళూరు, కోనసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్నప్పటికీ.. ధరలు తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నిమ్మకాయ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మెహిదీపట్నం రైతు బజార్ లాంటి ప్రాంతాల్లోనే రసం బాగుండే నిమ్మ కాయను ఒక్కోటి రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. సైజ్ కాస్త తక్కువగా ఉంటే రూ.10కి అమ్ముతున్నారు. గతంలో రూ.30 పెడితే సాధారణ సైజ్ నిమ్మకాయలు డజను వచ్చేవి. ఇప్పుడు రూ.50 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. డెంగీ జ్వరాల ఎఫెక్ట్‌తో బొప్పాయి పండ్ల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉల్లి, కొబ్బరి బోండాలు, నిమ్మకాయ ధరలు ఎక్కువగా ఉండటం పట్ల హైదరాబాద్ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధర పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు.. వర్షాకాలంలో కొబ్బరి బోండాలు, నిమ్మకాయల ధరలు ఈ స్థాయిలో ఉండటం గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.


By September 22, 2019 at 10:50AM


Read More https://telugu.samayam.com/telangana/news/onion-tender-coconut-and-lemon-dearer-in-hyderabad-market/articleshow/71241495.cms

No comments