Breaking News

చంద్రయాన్-2 నుంచి విడిపోయిన ల్యాండర్.. సంబరాల్లో శాస్త్రవేత్తలు


ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహంలోని అత్యంత కీలక ఘట్టం సోమవారం విజయవంతంగా పూర్తయ్యింది. ఆర్బిటర్‌ నుంచి ‘విక్రమ్‌’ ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియ విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12.45 నుంచి 1:15 గంటల మధ్య ఈ ప్రక్రియ పూర్తిచేశారు. ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియపై ఉత్కంఠగా ఎదురుచూసిన ఇస్రో శాస్త్రవేత్తలు అది విజయవంతమవడంతో సంబరాలు చేసుకున్నారు. దీంతో ప్రయోగం 99 శాతం విజయవంతమైందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండర్‌ విడిపోయిన అనంతరం చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రక్రియకు మరింత చేరువకానుంది. చంద్రయాన్‌-2 ఉపగ్రహం పైభాగంలో ల్యాండర్‌ ఉంటుంది. దీన్ని క్లాంపులు, ప్రత్యేక బోల్టులతో ఆర్బిటర్‌కు అనుసంధానించారు. సోమవారం నిర్దేశిత కక్ష్య పరిధిలోకి చేరగానే ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయేలా ఇస్రో సంకేతాలు పంపింది. విడిపోయే ప్రక్రియ కొన్ని మిల్లీసెకన్లలోనే పూర్తయింది. తొలుత ఆర్బిటర్‌, ల్యాండర్‌ను సంధానించే రెండు బోల్టులు తెగిపోయాయి. ఫలితంగా ల్యాండర్‌ వేరుపడింది. సెప్టెంబరు 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్‌ కక్ష్యను తగ్గించనున్నారు. సెప్టెంబరు 3న ఉదయం 8.45 నుంచి 9.45 మధ్య ఒకసారి, సెప్టెంబరు 4న మరోసారి తగ్గిస్తారు. దీంతో అది 35 × 97కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుతుంది. సెప్టెంబరు 7న ల్యాండర్ చంద్రుడి ఉఫరితలం దిగనుంది. ఆ రోజున ల్యాండర్‌లోని ‘పవర్‌ డిసెంట్‌’ దశ ప్రారంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్‌ బయటకు వస్తుంది. దీనికి ముందే సెప్టెంబరు 5 తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్య చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాత్మకంగా దింపే అవకాశం ఉంది. ఆర్బిటర్, ల్యాండర్ పనితీరును బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌కు చెందిన మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ పర్యవేక్షిస్తోంది. దీనికి బైలాలులోని భారత డీప్ స్పేస్ నెట్‌వర్క్ సహకారం అందజేస్తోంది. కాగా, చంద్రునిపై ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఉపగ్రహాలను ప్రయోగించాయి. వాటి సరసన భారత్‌ నిలిచింది. అయితే అమెరికా అంతరిక్షనౌకలు చంద్రుని మధ్యప్రాంతంలో, రష్యా, చైనాలవి ఉత్తరభాగంలో దిగి పరిశోధనలు జరిపాయి. వీటికి భిన్నంగా భారత్‌ దక్షిణ ప్రాంతాన్ని ఎంచుకొంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. ఇక్కడ ఎక్కువభాగం ఛాయలోనే ఉంటుంది కాబట్టి, ఇక్కడ నీటి వనరులు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనలను ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు ఇస్రోకు పంపనుంది. అక్కడ ఉన్న ఖనిజ నిల్వలు, వాతావరణం.. తదితర అంశాల గురించి పరిశోధన నిర్వహించనుంది. దీని ద్వారా చంద్రుని ఆవిర్భావం, పరిణామక్రమం. .తదితర అంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది.


By September 02, 2019 at 02:47PM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-scientists-successfully-seperated-vikram-pragyan-from-chandrayaan-2-orbiter/articleshow/70945871.cms

No comments