Breaking News

సెప్టెంబరులో భారీ వర్షాలు.. 102 ఏళ్ల రికార్డు బద్దలు


ఉత్తరాదిలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బీహార్, యూపీ సహా పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో మొత్తం 137 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం ఒక్కరోజే యూపీలో 14 మంది, బిహార్‌లో 18 ప్రాణాలు కోల్పోయారు. యూపీలో గురు, శనివారాలు 47 మంది, శని,ఆదివారాల్లో మొత్తం 49మంది మృతి చెందారు. బీహార్‌లో గత రెండు రోజుల్లో 31 మంది వరదలకు చనిపోయారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 10.2 సెం.మీ.,వారణాసిలో 8.42 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ సీజన్‌లో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే దాదాపు 1700 శాతం అధికంగా కురిసినట్టు నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలకు పాట్నా నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రముఖులు ఉండే రాజేంద్రనగర్‌, పాటలీపుత్ర ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఆసుపత్రుల్లోకి కూడా నీళ్లు చేరడంతో వైద్య సేవలు అందించడం కష్టమవుతోంది. అనేక చోట్ల విద్యుత్తు సబ్‌స్టేషన్లు నీట మునగడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 30 రైలు సర్వీసులను రద్దు చేశారు. ఉత్తరాఖండ్‌‌లోని హిమకుంద్‌ సాహెబ్‌ను దర్శించుకునేందుకు పంజాబ్‌ నుంచి వచ్చిన ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న వాహనంపై కొండచరియ విరిగిపడటంతో మృత్యువాత పడ్డారు. కాగా, గత 102ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సెప్టెంబరులో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు గల ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే 9 శాతం అధికంగా కురవడం విశేషం. సెప్టెంబరు 29 వరకు దేశవ్యాప్తంగా సగటున 247.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇది సాధారణం కంటే 48 శాతం అధికం. అంతేకాదు, 1091 నుంచి భారత వాతావరణ విభాగం చరిత్రలో ఇదే మూడో అత్యధిక వర్షపాతం. ఈ నెలలో ఒక్క రోజు మిగిలి ఉండగా, సోమవారం కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో 1983 నాటి 255.8 మి.మీ. వర్షపాతం రికార్డ్ చెరిగిపోనుంది. గత శతాబ్ద కాలంలో 2019 సెప్టెంబరులోనే అత్యంత వర్షపాతం నమోదుకావడం విశేషం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించడంతో జూన్‌లో 33 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. అయితే, సెప్టెంబరులో విస్తారంగా కురిసిన వర్షాలతో 25 ఏళ్ల ఖరీఫ్ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. దేశంలో సాధారణ వర్షపాతం సగటు 877 మి.మీ. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ 956 మి.మీ. కురిసింది. జూన్, జులైలో లోటు వర్షపాతం ఉన్నా, ఆగస్టు, సెప్టెంబరులో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో గత 31 ఏళ్లలో ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలు కురువడం ఇదే తొలిసారి.


By September 30, 2019 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vigorous-rainfall-has-put-in-this-month-wettest-september-india-has-seen-in-102-years/articleshow/71369551.cms

No comments