Breaking News

గ్యాంగ్‌రేప్ చేసి వీడియోలతో బెదిరింపులు.. కోర్టు సంచలన తీర్పు


మహిళపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బెదిరించిన కేసులో ముగ్గురు కామాంధులకు ఆదిలాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత నిందితుకు శిక్ష పడటం గమనార్హం. ఈ కేసులో తుదితీర్పు వెలువరించిన జడ్జి జీవీఎన్‌ భరతలక్ష్మి ముగ్గురు నిందితులకు జైలుశిక్షతో పాటు రూ.60వేల జరిమానా విధించారు. కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలంలోని ఓ గ్రామంలో 2015లో ఈ ఘటన జరిగింది. పొలంలో పనిచేసేందుకు వచ్చిన వివాహితతో మాటలు కలిపి అన్నదమ్ములు షేక్ జాహిద్, షేక్ వహీద్, సల్మాన్‌ఖాన్ ఆమెకు తాగేందుకు మంచినీళ్లు ఇచ్చారు. నీళ్లలో మత్తుమందు కలపడంతో మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను దగ్గర్లోని పొదల చాటుకు తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. స్పృహ వచ్చిన తర్వాత బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని తెలుసుకుని షాకైంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని నిందితులు ఆమెను బెదిరించారు. కొద్దిరోజుల తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ జాహిద్ ఆ వీడియోలను గ్రామంలోని ఓ వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ గ్రూపులో ఉన్నవారిలో చాలామందికి బాధితురాలు తెలియడంతో ఆమెను నిలదీశారు. దీంతో ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి బోరుమంది. స్థానికుల సాయంతో 2015, డిసెంబర్ 12న ఆమె ఈ ఘటనపై ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వీడియో తీసిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో 16 మంది సాక్ష్యులను ప్రశ్నించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. సోమవారం తుది వాదనలు విన్న కోర్టు ముగ్గురు నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.60వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.


By August 20, 2019 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-get-sentenced-to-life-for-gang-rape-on-woman-in-telangana/articleshow/70748959.cms

No comments