Breaking News

‘కశ్మీర్’పై మోదీ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు.. రాహుల్ ఆసక్తికర ట్వీట్!


కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేయడం పట్ల కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్ నేత , తొలిసారిగా ఈ అంశంలో మోదీకి మద్దతుగా మాట్లాడారు. ఈ విషయమై బుధవారం సోషల్ మీడియాలో రాహుల్ ట్వీట్ చేస్తూ.. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘చాలా విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను నేను వ్యతిరేకించాను. కానీ ఈ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. కశ్మీర్‌ భారత అంతర్గత వ్యవహారం.. ఇందులో పాకిస్థాన్‌ లేదా మరే దేశమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జమ్మూ కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పాకిస్థాన్‌ మద్దతుతోనే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశం పాకిస్థాన్‌ అని తెలిసిందే కదా’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాహుల్‌ సహా విపక్ష బృందం శ్రీనగర్‌ వెళ్లగా భద్రతాకారణాల దృష్ట్యా వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ విషయంలో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తోన్న రాహుల్.. ఇలాంటి ట్వీట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ ట్వీట్‌కు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ ఎప్పటినుంచో చెబుతున్నది ఇదే. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. ఆర్టికల్‌ 370 రద్దు ప్రక్రియను మాత్రమే మేం వ్యతిరేకించాం. ఎందుకంటే అది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువను దెబ్బతీసేలా ఉంది. అంతేగానీ.. కశ్మీర్‌ అంశానికి తాము వ్యతిరేకం కాదని, పాక్‌‌ను సమర్ధించాలనే ఉద్దేశం కూడా కాదు’ అని థరూర్‌ పేర్కొన్నారు. కాగా, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుచేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ను విభజించి దేశ సమగ్రతను కాపాడలేరని, విభజన పూర్తిగా అధికార దుర్వినియోగమేనని రాహుల్ దుయ్యబట్టారు. దేశమంటే భూములు, ప్లాట్లు కాదని... దేశమంటే ప్రజలు అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. దేశాన్ని ప్రజలు నిర్మించారన్న రాహుల్... ప్రజాప్రతినిధుల్ని జైల్లో పెట్టడం రాజ్యంగా విరుద్ధమంటూ విమర్శించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జాతీయ భద్రతకు తీవ్రమైన చిక్కులు ఏర్పడతాయని రాహుల్ పేర్కొవడం విశేషం.


By August 28, 2019 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-is-a-indias-internal-issue-no-room-for-other-country-to-interfere-in-it-rahul-gandhi/articleshow/70870288.cms

No comments