Breaking News

గటారీ అమావాస్య ఎఫెక్ట్.. మాంసం, చేపలకు భారీ డిమాండ్!


హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసం రేపటి నుంచి మొదలవనుంది. ఈ నెల రోజులపాటు వరలక్ష్మీ వ్రతాలు, ఉపవాసాలతో పవిత్ర పూజలు నిర్వహిస్తారు. దీంతో నెలంతా మాంసం ప్రియులు నోరు కట్టుకోవాల్సిందే. కాబట్టి ఆషాఢం మాసం చివరి రోజైన గురువారం (ఆగస్టు 1) పేరుతో మహారాష్ట్రీయులు ప్రత్యేక పండుగ చేసుకుంటారు. రానున్న నాలుగు నెలల పాటు మాంసానికి దూరంగా ఉండాల్సి రావడంతో ఈ రోజు నాన్‌వెజ్‌ను చాలా ఇష్టంగా ఆరగిస్తారు. దీంతో గటారీ అమావాస్యకు వారం ముందు నుంచే పుణే నగరంలో మేక, కోడి, చేప మాంసాలకు విపరీత డిమాండ్ పెరిగింది. పుణే పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా పుణేలో ప్రతిరోజు సగటున సుమారు 150 నుంచి 200 టన్నుల చికెన్ అమ్ముడవుతుంది. కానీ, గటారీ అమావాస్య సందర్భంగా వినియోగదారులు ముందు రోజైన బుధవారం (జులై 31) ఒక్కరోజే దాదాపు 200 నుంచి 250 టన్నుల చికెన్, టన్ను మటన్, ఒకటిన్నర టన్ను చేప మాంసాన్ని కొనుగోలు చేశారని అక్కడి వ్యాపారులు తెలిపారు. కానీ, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 10 నుంచి 15 శాతం తగ్గాయంటున్నారు. గత వారం రోజులుగా పుణేలో కురుస్తున్న భారీ వర్షాలు మాంసం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపడమే దీనికి ప్రధాన కారణం. మహారాష్ట్రీయులకు చాలా ప్రత్యేకం.. శ్రావణ మాసం ముందు రోజే వచ్చేదే ఈ గటారీ అమావాస్య. మహారాష్ట్ర వాసులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. రానున్న నెల రోజులంతా నియమ నిష్టలు పాటిస్తూ మాంసం, మద్యానికి దూరంగా ఉంటారు. కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తారు. కాబట్టి ఆషాఢ మాసం చివరి రోజైన అమవాస్య నాడు గటారీ అమావాస్య పేరుతో పెద్ద పండగ చేసుకుంటారు. అమావాస్య రాత్రంతా మేలుకుని పార్టీలు చేసుకుంటారు. మనసుకు నచ్చిన మాంసాహారం, మద్యం తీసుకుంటారు. బంధువుల ఇళ్లకు వెళ్లి తెల్లవారుజాము వరకు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తారు. ప్రధాన నగరాల్లోని కొన్ని హోటళ్లు ప్రత్యేకంగా తెల్లవారుజాము వరకు పార్టీలు నిర్వహించడం గమనార్హం.


By August 01, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/meat-fish-sales-raised-in-pune-on-the-occasion-of-gatari-amavasya/articleshow/70477165.cms

No comments