Breaking News

లావుగా ఉన్నానని వేధిస్తున్నాడు.. భర్తపై కోర్టుకెక్కిన భార్య


భర్త తాగొచ్చి కొడుతున్నాడని, అదనపు కట్నం కోసం ఒత్తిడి చేస్తున్నాడని, లేక ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని వేధిస్తున్నాడనో పోలీసులను, కోర్టులను ఆశ్రయించే మహిళలను చూసే ఉంటాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఓ విచిత్ర కారణంతో భర్తపై కోర్టుకెక్కింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం తొలుత అవాక్కైనా దాన్ని విచారణకు స్వీకరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నూరుకు చెందిన మహిళకు మీరట్ నగరానికి చెందిన ఓ యువకుడితో 2014లో వివాహమైంది. ప్రస్తుతం ఆ దంపతులు ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నివాసముంటున్నారు. తాజాగా ఆమె భర్తపై కోర్టుకెక్కింది. తాను లావుగా ఉన్న కారణంగా భర్త పట్టించుకోవడం లేదని, బయటకు, పార్టీలకు తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నాడని కోర్టులో పిటిషన్ వేసింది. లావుగా ఉన్నావంటూ భర్త తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడని, మద్యం తాగాలని ఒత్తిడి చేస్తున్నాడని పిటిషన్‌లో పేర్కొంది. తనను మంచిగా చూసుకునేలా భర్తను ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ఘజియాబాద్‌లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


By August 28, 2019 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-body-shames-wife-up-woman-approaches-court/articleshow/70869507.cms

No comments