Breaking News

జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద.. అధికారులు అప్రమత్తం


కృష్ణమ్మ ఆలమట్టిని దాటి, నారాయణ్‌పూర్ అక్కడ నుంచి జూరాల మీదుగా తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని శ్రీశైలానికి వడివడిగా వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన వరదతో జూరాల నిండుకుండలా మారింది. దీంతో దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. నుంచి 2,16,346 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రవాహం గురువారం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 804.10 అడుగులు, నీటినిల్వ 31.0443 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఆలమట్టి జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో వరద ప్రవాహాన్ని దిగువన ఉన్న నారాయణపూర్‌ విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు జూరాలకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 9 టీఎంసీలు కాగా రెండు రోజుల్లోనే 8.6 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి ప్రవాహం భారీగా ఉండటంతో శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో 1,81,459 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం రాత్రి 9 గంటలకు 2,16,346 క్యూసెక్కులకు పెరిగింది. జూరాల నుంచి కాలువలకు నీటిని విడుదల చేయడంతోపాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా నీటిని తరలిస్తున్నారు. కృష్ణా, దాని ఉపనది భీమా పరివాహక ప్రాంతాల్లో మంగళవారం అత్యధిక వర్షపాతం నమోదైనందున ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. బుధవారం 24 గేట్ల ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని వదిలారు. జూరాల ఎగువ, దిగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాలకు 19,609 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రెండు విద్యుత్తు కేంద్రాల ద్వారా 11 యూనిట్లలో 299 మోగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. బుధవారం వరకు ఎత్తిపోతల పథకాలతోపాటు శ్రీశైలం జలాశయానికి 1.759 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు జూరాల ప్రాజెక్టు ఈఈ శ్రీధర్‌ తెలిపారు.


By August 01, 2019 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/krishna-river-flood-water-releases-from-jurala-project-to-srisailam/articleshow/70474826.cms

No comments