Breaking News

‘నేషనల్ స్టాక్ రీసెర్చ్’ పేరుతో మోసం.. రూ. 80 లక్షలకు టోకరా..


సులభంగా డబ్బు సంపాదించే మార్గం అంటూ ఆశ చూపారు. రూ. లక్ష పెట్టుబడి పెడితే 12 లక్షలు ఆర్జించవచ్చంటూ ఎరవేశారు. షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. దీంతో ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొంత మంది గుడ్డిగా డబ్బులు సమర్పించుకున్నారు. తీరా అసలు విషయం తెలిసి మోసపోయామంటూ గుండెలు బాదుకుంటున్నారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు ఇప్పిస్తామంటూ నెటిజన్లను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి సీపీయూలు, ల్యాప్‌టాప్‌, ఫోన్లు, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీసీ, రాచకొండ క్రైమ్స్‌ ఇన్‌చార్జ్ నారాయణ్‌రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. బిహార్‌లోని పాట్నాకు చెందిన రాహుల్ అనే వ్యక్తి ఉద్యోగ వేట కోసం బెంగళూరుకు వలసవెళ్లాడు. స్టాక్ మార్కెట్‌, షేర్ మార్కెట్‌లపై రాహుల్‌కు మంచి అవగాహన ఉంది. సౌత్ బెంగళూరులో నేషనల్ స్టాక్ రీసెర్చ్ పేరుతో వివిధ హంగులతో కార్యాలయం ఏర్పాటు చేశాడు. కానీ, సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే కంపెనీని అక్రమంగా నడుపుతున్నాడు. కంపెనీకి రాహుల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన బండ్లపల్లి సూర్య చైతన్యను ఫ్లోర్ మేనేజర్ హోదాతో నియమించుకున్నాడు. మరికొంత మందిని ఉద్యోగులుగా నియామకం చేశాడు. రాహుల్, సూర్య చైతన్య సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాలు చేయడానికి ప్లాన్ చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే డీమ్యాట్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నారు. స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీల ద్వారా వారి ఫోన్ నెంబర్లు సేకరించారు. ఉద్యోగుల ద్వారా ఫోన్ చేయించి, తమ కంపెనీకి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి నమ్మించేవారు. ట్రేడింగ్‌లో, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు సలహాలిస్తామని, షేర్లు కొనడానికి, విక్రయించడానికి స్టాక్‌ వివరాలు అందజేస్తామని డీమ్యాట్‌ ఖాతదారులను ఫోన్లు, ఈ-మెయిల్‌ ద్వారా ఆకర్షించేవారు. పెట్టుబడికి 5 నుంచి 12 రెట్లు లాభాలు ఆర్జించవచ్చని ఆశ చూపారు. దీంతో ఈజీ మనీ కోసం ఆశ పడిన కొంత మంది, కంపెనీ మాయ మాటలు నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. అయితే, కస్టమర్లు పెట్టిన డబ్బును షేర్ మార్కెట్లో అసలు ఇన్వెస్ట్ చేయకుండా తమ జేబుల్లో వేసుకున్నారు. పెట్టుబడి దారుల ఫోన్ కాల్స్, ఈ మెయిల్‌లకు స్పందించడం మానేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన శ్రావణ్‌ను రూ. లక్ష పెట్టుబడి పెడితే రూ. 12 లక్షలు సంపాదించవచ్చు అంటూ రాహుల్, సూర్య చైతన్య నమ్మించారు. దీంతో పెట్టుబడి పెట్టి, వారి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. శ్రావణ్ ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాదిన్నర కాలంలో బాధితుల నుంచి రూ. 80 లక్షల వరకు వసూలు చేశారని తేలింది. దీంతో బెంగళూరు కార్యాలయంలో సోదాలు చేసి రాహుల్, చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు.


By August 10, 2019 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-arrested-for-stock-market-fraud/articleshow/70615169.cms

No comments