Breaking News

విత్తనాల కొరతకు బాబే బాధ్యుడు.. ఆయన నిర్వాకం వల్లే ఇలా: మంత్రి కన్నబాబు


ఆంధ్రప్రదేశ్‌లో విత్తనాల కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో వేచిచూస్తున్నా సరే వారికి రిక్తహస్తమే. సరిపడ విత్తనాలు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనుసాగుతున్నాయి. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విత్తనాల కొరతకు పూర్తి బాధ్యత చంద్రబాబే వహించాలని ఏపీ వ్యవసాయ శాఖ విమర్శించారు. జూన్‌ 8 వరకూ తానే సీఎంనన్న ఆయనకు ఖరీఫ్‌ కాలానికి విత్తనాలు సేకరించాలనే ఆలోచన కూడా తెలియలేదా? అని ధ్వజమెత్తారు. విత్తనాల సేకరణకు సంబంధించి రూ.380 కోట్ల నిధులు చెల్లించకుండా వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని దుయ్యబట్టారు. నిధులివ్వకపోతే విత్తన సేకరణ చేయలేమని, రాయితీ సొమ్ము విడుదల చేయాలని 28 సార్లు లేఖలు రాసినా నాటి ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. దీనిపై ఆర్థికశాఖ అధికారులు, సీఎంను కలిసినా ఫలితం లేకపోయిందని మంత్రి పేర్కొన్నారు. ఫిబ్రవరి, మార్చిలో విత్తన సేకరణ చేయకపోతే రైతులు ఇబ్బందులు పడతారని, దీనికి రూ.108 కోట్లు విడుదల చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గతంలో రాసిన లేఖలను మంత్రి చూపించారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే విత్తన సేకరణకు చర్యలు తీసుకోవాలని, వెంటనే నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారన్నారు. అవసరమైతే అధిక ధర చెల్లించి విత్తనాలు సేకరించాలని స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 4.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటే తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి 50 వేల క్వింటాళ్లనే సేకరించారన్నారు. తాము అధికారంలోకి వచిన తర్వాత 2.70 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేసి రైతులకు అందజేశామని, మరో 50వేల క్వింటాళ్లను అందుబాటులో ఉంచినట్టు తెలియజేశారు. కర్ణాటక, తెలంగాణతోపాటు బరోడా నుంచి అదనంగా తెప్పిస్తున్నామని మంత్రి తెలిపారు.


By July 02, 2019 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-agriculture-minister-kannababu-allegations-on-chandrababu-for-seeds-shortage/articleshow/70035801.cms

No comments