Breaking News

బీజేలోకి ధోనీ.. ఝార్ఖండ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ?


మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు. మెరుపు ఆటతో అంతకుమించి వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న క్రికెట్లో రిటైర్మె్ంట్‌కు దగ్గరయ్యాడు. ఆదివారమే 38వ పుట్టినరోజు జరుపుకున్న ధోనీకి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్పే ఆఖరిది. ఈ మెగా టోర్నీ తర్వాత ధోనీ ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతుండగానే మరోపక్క ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగానే ధోనీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడంటూ సండే గార్డియన్ అనే పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ధోనీ బీజేపీలో చేరతాడని తనకు మాటిచ్చినట్లు ఓ నేత చెప్పినట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది. అక్టోబరులో జరిగే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధోనీ పోటీ చేస్తాడని ఆ నేత చెప్పినట్లు వెల్లడించింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఈ పార్టీ సీనియర్ నేత రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఐదేళ్ల బీజేపీ పాలనపై ఝార్ఖండ్‌లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా గిరిజనులు బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న ఆ పార్టీ ధోనీ క్రేజ్ వాడుకోవాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తులను, ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి, యువతను తమవైపు తిప్పుకోవడానికే ధోనీ పేరును తెరపైకి తెస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ధోనీ ఇంగ్లండ్ నుంచి వచ్చిన వెంటనే తాము సంప్రదించి బీజేపీలోకి వచ్చేలా ఒప్పిస్తామని కొందరు బీజేపీ కేంద్ర నేతలు చెప్పినట్లు సండే గార్డియన్ పత్రిక తన కథనంలో ఉటంకించింది. టీమిండియా ఓపెనర్‌గా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. క్రికెటర్ల క్రేజ్‌ను వాడుకుని బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


By July 08, 2019 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cricketer-ms-dhoni-may-to-join-bjp/articleshow/70121453.cms

No comments