Breaking News

టిక్‌టాక్ వ్యవసనంలో ఖమ్మం కార్పోరేషన్‌ సిబ్బంది... పనులు మానేసి వీడియోలతో కాలక్షేపం


ప్రజలకు జవాబుదారీగా ఉండి వారి పనులు చేసిపెట్టాల్సిన ప్రభుత్వ అధికారులు విధులు మానేసి సోషల్‌మీడిమా బాట పట్టారు. ఆఫీసులో పనులు గాలికొదిలేసి వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగులు స్మార్ట్‌పోన్లు పట్టుకుని తీసుకున్న టిక్‌టాక్ వీడియోలు వైరల్‌ కావడంతో ప్రజలు తిట్టిపోస్తున్నారు. ప్రజలు తమ పనులు చేసిపెట్టాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా తమకు టైమ్ లేదని తిప్పిపంపే ప్రభుత్వ సిబ్బందికి టిక్‌టాక్ వీడియోలు తీసుకునేంత తీరిక ఎక్కడిదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వందలాది మంది వస్తుంటారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు మొర పెట్టుకుంటుంటారు. అయితే ప్రజలకు అందించాల్సిన సేవలకు తీరిక లేదని చెప్పే సిబ్బంది టిక్‌టాక్ వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేయడంపై అంతా మండిపడుతున్నారు. ప్రజలకు సేవలందించాలనే సంకల్పంతో ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలు చేపట్టి జీవనోపాధి కల్పిస్తుంటే కొందరేమో పనులు పక్కనబెట్టి కాలక్షేపం చేస్తూ ఉద్యోగుల స్థాయిని దిగజారుస్తున్నారు. పనివేళల్లో ఆఫీసులోనే పాటలు, డైలాగులను అనుకరిస్తూ సహోద్యోగుల పని కూడా చెడగొడుతున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినా సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే పడకేశాయి. కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది తీరుపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ప్రజలు తాజాగా వారి టిక్‌టాక్ వీడియోలు బయటకు రావడంతో కనిపిస్తే కొట్టేంత కోపంతో ఊగిపోతున్నారు. కార్పోరేషన్ విభాగాల్లో సానిటేషన్, రోడ్లు, డెత్, బర్త్ సర్టిఫికెట్ల కోసం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని సిబ్బందికి టిక్‌టాక్ వీడియోలు తీసుకునే టైమ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల నిర్వాకంపై కార్పోరేషన్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్నవారికి కాకుండా పైరవీలు చేసిన వారికి ఉద్యోగాలు ఇస్తుండటంతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసుల్లో పనులు మానేసి కాలక్షేపం చేసే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఖమ్మం కార్పోరేషన్‌లో ఉద్యోగుల టిక్‌టాక్ వీడియోల అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న అనిత, జ్యోతి, రవిలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీళ్లంతా బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సులు ఇచ్చే కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ వీడియోల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, డీబీ సెక్షన్ అసిస్టెంట్ వీరన్న కూడా కనిపించడంతో వారిని అధికారులు సంజాయిషీ కోరారు.


By July 15, 2019 at 12:55PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/show-cause-notice-to-khammam-corporation-staff-who-made-tiktok-video/articleshow/70224409.cms

No comments