Breaking News

కేశినాని మరో ట్వీట్.. ఈసారి టార్గెట్ ఆయనేనా?


ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో అసమ్మతి రాగం మొదలైదంది. అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక, ఫలితాల అనంతరం విజయవాడ ఎంపీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతోన్న పోస్టులు చర్చకు దారితీస్తున్నాయి. లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ ఉపనేత పదవిని చంద్రబాబు కట్టబెట్టినా, తనకు వద్దంటూ తిరస్కరించారు. అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కేశినేని తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ప్రత్యక్షంగా ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా ఇది టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ నేతపై చేసిందనే ప్రచారం సాగుతోంది. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు...నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు....దౌర్బాగ్యం’ అంటూ ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ చేశారు. కొద్దిరోజుల నుంచి విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ట్వీట్స్‌ నేపథ్యంలో కేశినేని టార్గెట్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ సీనియర్ నేతకు, కేశినేని నానికి మధ్య విభేదాలు ఉన్నాయి. టీడీపీలో షో మ్యాన్‌లు అవసరం లేదంటూ ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌తో మరోసారి నాని కాకరేపారు. మాజీమంత్రి దేవినేని ఉమను కూడా టార్గెట్ చేస్తూ కేశినేని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తనని మంత్రిని చేసిన ఉమాకి కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి అంటూ పెట్టిన పోస్ట్ టీడీపీలో ఉన్న వర్గపోరును బయటపెట్టింది. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి కేశినేని నాని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. వీరేదో ఏపీని ఉద్దరించడానికి బీజేపీలోకి వెళ్లారనుకున్నా, కానీ వాళ్లను వాళ్లు ఉద్దరించడానికే వెళ్లారని కేంద్ర బడ్జెట్ తర్వాత సుజనా బ్యాచ్‌పై సెటైర్లు వేశారు.


By July 14, 2019 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/mp-kesineni-nani-once-again-targets-tdp-leader-through-social-media/articleshow/70212442.cms

No comments