రూల్స్ బ్రేక్ చేశాయని ఆ మూడు ఛానెల్స్కు జగన్ షాక్!

ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెల్స్ను శాసనసభ ఆవరణలోకి ప్రవేశం నిరాకరిస్తూ బుధవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణాచార్యులు నోటీసులు జారీచేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం ఉదయం సభ జరుగుతుండగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ అంశాన్ని స్పీకర్ తమ్మినేని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నోటీసులు జారచేశారు. మీడియా పాయింట్ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి గల కారణంపై వివరణ ఇచ్చేవరకూ అసెంబ్లీలోకి అనుమతించబోమని నోటీసుల్లో స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఈ మూడు చానెల్స్ ప్రతినిధులను శాసనసభ ఆవరణలోకి అనుమతించలేదు. అయితే, వీరు వివరణ ఇచ్చిన తర్వాత వీడియోగ్రాఫర్ గానీ, కెమెరామెన్లను కాకుండా కేవలం ప్రతినిధులను మాత్రమే బుధవారం మధ్యాహ్నం అనుమతించడం విశేషం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5లు అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించాయని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈ మూడు ఛానల్ వాటిని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే, సభ జరుగుతున్నప్పుడు ఇలా మీడియా పాయింట్ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేయడం రూల్స్కి వ్యతిరేకం. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చానెల్స్ వాటిని అతిక్రమించి ప్రత్యక్ష ప్రసారం చేయడంతో చర్యలు తీసుకున్నారు. కానీ, గతంలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుంటే సాక్షి పలుసార్లు ప్రత్యక్ష ప్రసారం చేసిందని, అప్పుడు టీడీపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఆలా చేస్తే మూడు చానెల్స్ మీద చర్యలు తీసుకోవడం ఏంటని అంటున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఈ మూడు మీడియా సంస్థలను హెచ్చరిస్తూ జగన్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
By July 26, 2019 at 08:24AM
No comments