Breaking News

కదిరి హత్యల కేసు: క్లూ దొరక్క తలలు పట్టుకుంటున్న పోలీసులు


జిల్లా కదిరి మండలం కొర్తికోట గ్రామంలో శివభక్తుల హత్యకేసు పోలీసులకు సవాలుగా మారింది. ముగ్గురు శివభక్తులను ఎవరు? ఎందుకు? హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు ఆధారాల కోసం పరిసర గ్రామాలతో పాటు రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతమంతా గాలిస్తున్నారు. శివభక్తుల హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల వివరాలు సేకరించిన పోలీసులు మంగళవారం ఇద్దరిని, బుధవారం మరికొందరిని ప్రశ్నించారు. గతంలో తంబళ్లపల్లిలో విగ్రహాల చోరీకి పాల్పడిన వ్యక్తులకు ఈ హత్యలతో ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పోలీసులు తలలు పట్టుకున్నారు. శివభక్తులను హత్యచేసిన వారు ఆధారాలు దొరకకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ఆధారాల కోసం గాలింపు చేపట్టినా ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. మూడు రోజులుగా కొర్తికోటలో అడుగడుగూ పరిశీలించినా ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మూడు హత్యలతో కొర్తికోట గ్రామంలో నిశ్శబ్దం నెలకొంది. పోలీసుల బూట్ల చప్పుళ్లలో అక్కడ ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మమ్మల హత్యకు గత కారణాలపై వారి కుటుంబసభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని కదిరి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఏ చిన్న ఆధారమైనా దొరికితేనే కేసు దర్యాప్తులో ముందడుగు పడుతుందని పేర్కొన్నారు.


By July 18, 2019 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-continues-enquire-on-kadiri-triple-murder-case/articleshow/70271498.cms

No comments