Breaking News

40ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబు?: సీఎం జగన్


సీఎం హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ప్రజావేదిక భవనాన్ని చట్టాలను ఉల్లంఘించి నిర్మించారని, అందుకే తాము అధికారంలోకి రాగానే కూల్చివేశామని ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పారు. రాష్ట్రంలోని అక్రమ కట్టడాల అంశంపై సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎంకైనా, సామాన్యుడికైనా ఒకటే రూల్ పాటిస్తామన్నారు. చట్టాలు ఉల్లంఘించి నిర్మించిన కట్టడం కోసం చట్టసభలో చర్చ చేపట్టడం సమంజసంగా లేదని జగన్ అన్నారు. నది ప్రవాహాన్ని అడ్డుకునేలా ఉంది కాబట్టే ప్రజావేదికను కూల్చివేశామని, ఆ ప్రాంతంలో నిర్మించిన కట్టడాలకు ఇప్పటికే నోటీసులు జారీచేశామన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. అందరికీ రోల్‌మోడల్‌గా ఉండాలని, నలుగురు చూసి ఆయన మా నాయకుడు అని చెప్పుకోవాలన్నారు. కానీ అధికారంలో ఉన్నాం కదాని ఇష్టం వచ్చినట్లు పాలిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చివేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. సామాన్యులతో పాటు నేతలు, ప్రముఖులు ఎవరు అక్రమ కట్టడాలు నిర్మించినా చర్యలు తప్పవన్నారు. అక్రమ కట్టడాల వల్ల వర్షాలు కురిసినప్పుడు ముంబయి, చెన్నై నగరాలు నీట మునుగుతున్న దృశ్యాలు ఏటా చూస్తూనే ఉన్నామని, కృష్ణా కరకట్టను రక్షించుకోలేకపోతే భవిష్యతులో విజయవాడ కూడా మునిగిపోతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.


By July 18, 2019 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-ys-jagan-speech-in-assembly-on-issue-of-illegal-constructions-inkrishna-river-karakatta/articleshow/70271714.cms

No comments