Breaking News

జగన్ అక్రమాస్తుల కేసు.. ఆ ఆస్తుల లిక్విడేషన్‌కు అనుమతించొద్దు: ఈడీ


ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా ఇందూ టెక్‌ జోన్‌కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థ రుణం చెల్లింపుల విషయంలో విఫలమైనందున ఇందూ టెక్ జోన్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెలీ లా ట్రైబ్యునల్‌ను ఐఎఫ్‌సీఐ లిమిటెడ్ ఆశ్రయించింది. దీనిపై ఎన్సీఎల్టీలో ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఆ ఆస్తులను దివాలా ప్రక్రియలో భాగంగా లిక్విడేషన్‌కు అనుమతించరాదని కోరింది. తమకు రూ.9.90 కోట్ల రుణం చెల్లింపులో విఫలమైన ఇందూటెక్‌ జోన్‌‌పై 2018 జనవరిలో ఐఎఫ్‌సీఐ కేసు వేయగా, ఏడాదిన్నరగా ఇది పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఇందూ గ్రూపు ప్రతిఫలంగా నాటి సీఎం కుమారుడు జగన్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని తెలిపింది. 2015 ఫిబ్రవరిలో ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి సంస్థలతోపాటు టెక్‌ జోన్‌కు చెందిన స్థిరాస్తులను తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. మామిడిపల్లిలో రూ.30 కోట్ల విలువైన 150 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. కుట్రపూరితంగా ఇందూ టెక్‌ జోన్‌ లబ్ధి పొందిందని, కాబట్టి దానికి చెందిన స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్‌ కింద చేసే ఆర్థిక నేరాల వల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని, అందువల్ల మనీలాండరింగ్‌ చట్టం కింద తాము జప్తు చేసిన ఆస్తులను లిక్విడేషన్‌కు అనుమతించరాదని ఈడీ కోరింది. ఇందూటెక్‌ జోన్‌ దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఐఎఫ్‌సీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. Read Also: ఇందూటెక్ కేసు విషయంలోనే మారిషస్‌ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని గతేడాది ఫిబ్రవరిలో ఆశ్రయించింది. మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్‌ ఎల్‌ఎల్‌సీ కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద 49శాతం వాటాల రూపంలో మొత్తం రూ.115 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఓ సారి రూ.1.18కోట్లు, రెండోసారి రూ.14కోట్లు, మూడో సారి రూ.99కోట్ల పెట్టుబడులు పెట్టింది. సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేశాక..అప్పటి నుంచి ఇందూ టెక్‌ జోన్‌ పనులు నిలిచిపోయాయి. దీంతో పెట్టుబడులు పెట్టిన తాము మోసపోయామంటూ 50 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని ఇప్పించాలని మారిషస్‌ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీకి నోటీసులు పంపడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది.


By July 05, 2019 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ed-approached-nclt-in-indu-techzone-case-is-part-of-disproportionate-assets-case-against-ys-jagan/articleshow/70083244.cms

No comments