Breaking News

చంద్రబాబు ఏర్పాటుచేసిన ఆ వ్యవస్థపై కాగ్ ప్రశంసలు!


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ () పనితీరుపై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు దీనిని ఓ అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆర్టీజీఎస్‌పై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ () అధికారులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్‌టైం గవర్నెన్స్‌ ఒక వినూత్న ప్రక్రియ అని కొనియాడారు. కాగ్‌ డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అండ్య్రూ డబ్ల్యూ.కె.లాంగ్‌స్టీ నేతృత్వంలో 17 మంది అధికారుల బృందం గురువారం అమరావతిలో పర్యటించింది. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని ఆర్టీజీఎస్‌ స్టేట్‌ కమాండ్‌ కేంద్రాన్ని సందర్శించింది. ప్రజలకు రియల్‌టైంలో ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రభుత్వం అందజేస్తోన్న సేవలు, నవరత్నాల పథకాలను అమలులో సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరును సీఈవో బాబు వారికి వివరించారు. ఈ సందర్భంగా కాగ్‌ అధికారులు మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్‌ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. చంద్రబాబు హయాంలో 2017 నవంబర్ 24న ఆర్టీజీఎస్‌ను ప్రారంభించారు. దీని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సెక్రటేరియట్‌లో ఉంది. ఈ వ్యవస్థ ఏర్పాటైన ఏడాదిలోనే పౌరసరఫరాల శాఖకు రూ.1600 కోట్లు ఆదా అయ్యాయి. దీని సాయంతో విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోగలుగుతోంది. గతేడాది ఫణి తుఫాన్ సమయంలో ఒడిశా ప్రభుత్వానికి ఆర్టీజీఎస్ చేసిన నిరంతర సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. నిఘా వ్యవస్థకు కూడా ఇది ఉపయోగడుతోంది. దీని వల్ల వడగాలులు, వర్షాల సమయంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడానికి వీలవుతుంది. పరీక్ష ఫలితాలు, డాష్‌బోర్డుల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించొచ్చు. వివిధ విభాగాల పనితీరు ఎలా ఉందో డ్యాష్ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టీజీఎస్‌ అద్భుతంగా ఉందని గతంలో నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు గుప్పించారు. ఆర్టీజీఎస్‌ను పరిశీలించాలని ప్రతి రాష్ట్రానికి తాము సిఫారసు చేస్తామని గతంలో ఆయన వ్యాఖ్యానించడం విశేషం. గతంలో అమరావతి వేదికగా జరిగిన ఆర్థిక మంత్రుల సదస్సులో పాల్గొన్న పలు రాష్ట్రాల మంత్రులు దీనిని పరిశీలించి ప్రశంసించారు. ఆర్టీజీఎస్ పరిష్కార వేదిక 1100 కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తుంటారు. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎ్‌ఫఎంఎస్‌) ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌ చేసి, బిల్లుల చెల్లింపు మొదలు అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫైబర్‌నెట్‌ సంస్థను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


By July 19, 2019 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/comptroller-and-auditor-general-appreciated-to-ap-real-time-governance-society/articleshow/70286621.cms

No comments