సంగం డెయిరీ చోరీ.. నిందితుడ్ని పట్టించిన గ్యాస్కట్టర్!
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆఫీసులో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆఫీసులోని బీరువాలో ఉంచిన రూ.71 లక్షల్లో రూ.44 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు, 24 గంటల్లోనే ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని వట్టిచెరుకూరు మండలం కురునూతల వాసిగా గుర్తించారు. బీరువా తెరిచిన గ్యాస్కట్టర్పై నిందితుడు పేరు రాసి ఉండటంతో పోలీసులకు మరింత సులువైంది. అయితే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సంగం డెయిరీ కార్యాలయంలో చోరీ జరగడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు కావడంతో సంస్థ క్యాషియర్ ఆఫీసు గదిలోని బీరువాలో రూ.71,65,670 నగదు భద్రపరచి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, బీరువాను గ్యాస్ కట్టర్తో కత్తిరించారు. అందులోని రూ.44,43,540లు నగదు ఎత్తుకెళ్లిన దుండగులు, మిగతా రూ.27,22,130 చిన్న నోట్లు కావడంతో మోయలేక వదిలేశారు. సోమవారం ఉదయం గది తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన డెయిరీ ఉద్యోగులు క్యాషియర్కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజూ పాల ఉత్పత్తుల విక్రయించగా వచ్చిన నగదు సంగం డెయిరీకి చేరుతుంది. ఆ నగదును క్యాషియర్ బ్యాంకులో జమచేస్తారు. శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం వచ్చిన నగదును డెయిరీలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో క్యాషియర్ గదిలో భద్రపరిచారు. డెయిరీలో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. సాధారణ వ్యక్తులు ప్రవేశించలేని విధంగా ఇక్కడ కాపాలా ఉంటుంది. సంగం డెయిరీ చుట్టూ ప్రహరీ ఉండటంతోపాటు ప్రాంగణమంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. సెక్యూరిటీ అధికారులు 24 గంటలూ కాపలా కాస్తారు.
By July 30, 2019 at 12:43PM
No comments