Breaking News

ఉరి సెక్టార్‌లో ప్రమాదవశాత్తు రివాల్వర్ పేలి తెలుగు జవాన్ మృతి


జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తోన్న ఓ తెలుగు సైనికుడు ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని అశోక్‌కుమార్‌ (21) ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉండగా అశోక్ చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాలిబూటు లేసు కట్టుకునే క్రమంలో దగ్గరున్న తుపాకీ పేలి చనిపోయినట్టు తల్లిదండ్రులకు సైనికాధికారులు సోమవారం ఉదయం సమాచారం అందజేశారు. జూన్‌లో సెలవుపై ఇంటికి వచ్చిన అశోక్‌ జులై 3న తిరిగి వెళ్లినట్టు బంధువులు తెలిపారు. వెళ్లిన రెండు రోజులకే తమ కన్నకొడుకు విగతజీవిగా ఇంటికొస్తున్నాడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో రాణించిన అశోక్‌కుమార్‌ పదో తరగతి వరకూ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో, కంభంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. తండ్రి నరసింహారావు మాజీ సైనికుడు కావడంతో... ఆయన బాటలో నడవాలనే సంకల్పంతో డిగ్రీ చదువుతూనే 2017లో ఆర్మీకి ఎంపికయ్యారు. నీలగిరిలో శిక్షణ పూర్తి చేసిన అశోక్‌కు తొలి పోస్టింగ్ జమ్ములో లభించింది. ఆర్మీలోకి వద్దని, ఉన్నత చదువులు చదవాలని తండ్రి వారించినా కాదని సైన్యంలో చేరాడు. పెద్దనాన్న కొడుకు వివాహానికి గత నెలలోనే ఇంటికి వచ్చిన అశోక్‌ పెళ్లిలో అందరితో సందడి చేశారు. అన్నావదినలతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామిని కూడా దర్శించుకుని, జులై 3న తిరిగి జమ్ముకు వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అశోక్ మృతదేహానికి సోమవారం రాత్రి పోస్ట్‌మార్టం పూర్తిచేశారు. బుధవారం నాటికి స్వగ్రామానికి తరలించనున్నారు. సైనిక లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరుడు సురేశ్ కూడా ఆర్మీలోనే విధులు నిర్వహిస్తున్నాడు.


By July 09, 2019 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/soldier-from-prakasam-district-died-in-jammu-and-kashmir-due-to-his-gun-misfire/articleshow/70137658.cms

No comments