AP Assembly: శాసనసభ్యుల తీరుపై స్పీకర్ అసంతృప్తి

ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇతర విషయాలపై చర్చకు ఒత్తిడి చేయొద్దని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలకు సభ్యులు అడ్డుపడ్డారు. నిన్న సభలో జరిగిన విషయాలపై మరోసారి అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ వారించారు. రోజూ సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టడం సంప్రదాయమని, దీనికి ఎవరూ అడ్డు పడొద్దని స్పీకర్ సభ్యులను కోరారు. సభ్యులు విలువైన సమయాన్ని వృథా చేయొద్దని, ఇతర విషయాలపై ప్రశ్నోత్తరాలు అయ్యాక చర్చిద్దామని చెప్పారు. బుధవారం సభలో జరిగిన రాద్ధాంతంపై చాలామంది సభ్యులు నొచ్చుకున్నారని, క్వశ్చన్ అవర్ సక్రమంగా జరగకపోతే తమ నియోజకవర్గ సమస్యలు ఎలా ప్రస్తావించాలని కొంతమంది తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని స్పీకర్ చెప్పారు. సభ సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత రెండు పక్షాలపై ఉందన్న స్పీకర్.. సభలో ఏ అంశంపై చర్చించాలన్న తన అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. సభలో తనకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సమానమేనని, ఎవరివైపు తాను పక్షపాతం వహించడం లేదన్నారు.
By July 18, 2019 at 09:50AM
No comments