Breaking News

ఏపీలో మళ్లీ భారీగా డీఎస్పీల బదిలీలు.. ఈసారి ఏకంగా 49 మంది!


ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీగా పోలీస్ అధికారుల బదిలీలు చేపట్టారు. మొత్తం 49 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 38 మందిని సబ్‌ డివిజన్లలో డీఎస్పీలుగా నియమించగా, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మరో పది మందిని నిఘా విభాగానికి బదిలీ చేశారు. ఒకరికి సీసీఎస్‌లో డీఎస్పీగా బాధ్యతలు అప్పగించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. సబ్‌ డివిజన్లలో డీఎస్పీలుగా పనిచేస్తున్న వారిలో నలుగురికే అక్కడ బాధ్యతలు అప్పగించారు. మిగతా 23 మందిని హెడ్ క్యార్టర్స్‌కు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల సబ్‌ డివిజన్లకు సంబంధించి ఈ బదిలీలు జరిగాయి. ఏపీలో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అలాగే జూన్ 27న తొలిసారిగా 37 మంది డీఎస్పీలను బదిలీ చేసి, వారిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ప్రస్తుతం వారి స్థానాల్లో వేరేవారిని నియమించారు. కాగా, పోలీస్ డిపార్ట్‌మెంట్ చరిత్రలో ఇంత పెద్దఎత్తున హెడ్‌క్వార్టర్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించిన దాఖలాలు లేవని అంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణాలతో ఇలా అధికారులను పెద్ద సంఖ్యలో హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేసినా.. వారికి వారం పది రోజుల్లోగా పోస్టింగులు ఇచ్చేవారు. కానీ, వీరికి ఇంతవరకూ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఏపీ పోలీస్ విభాగంలో కులాల కురుక్షేత్రం సాగుతోందనే వాదన వినిపిస్తోంది. టీడీపీ హయాంలో కమ్మ, నేడు ప్రభుత్వంలో రెడ్డి పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్నామని కొంతమంది డీఎస్పీలు ఆవేదన చెందుతున్నారు. ఐపీఎస్‌ల మాదిరిగా తమకూ కేడర్లు ఉండి ఉంటే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతామని వాపోతున్నారు. ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఈ అంశం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది.


By July 17, 2019 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-dgp-gowtham-sawang-passed-on-order-of-49-dsps-transfer/articleshow/70254309.cms

No comments