Breaking News

‘కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలా జగన్.. నాటి మాటలేమయ్యాయి’


వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద నీటికి కృష్ణా బేసిన్‌లోకి తరలించి ఇరు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలనే ఆలోచనతో ఏపీ, తెలంగాణ సీఎంలు సమావేశమైన విషయం తెలిసిందే. శ్రీశైలానికి గోదావరి వరద నీటిని మళ్లించి సాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని, జలాశయం నిండనంత వరకు విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉంటుందని ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్, జగన్ భేటీపై నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. చేతిలో జగన్ కీలుబొమ్మలా మారారని దుయ్యబట్టారు. శనివారం కడపలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. నదీ జలాల పంపకాల్లో జగన్‌ అవగాహనారాహిత్యంతో ఏపీ ఎడారిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించి ఏపీ, తెలంగాణ వినియోగించుకుంటాయని భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు పేర్కొన్న మాటలను ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మాటలు నమ్మడం అవివేకమవుతుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకురావాలనే సంకల్పం జగన్‌మోహన్‌రెడ్డికి ఉంటే పోలవరం కుడి కాలువను వెడల్పు చేసి, అక్కడి నుంచి ఎగువన ఉన్న ప్రాజెక్టులకు పంపింగ్‌ చేయవచ్చని తులసిరెడ్డి సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాఖ్యలను మనం చూస్తునే ఉన్నామని, ఆయన చెప్పినట్లు మన ముఖ్యమంత్రి వినడం రాష్ట్రానికి శాపంగా పరిణమించబోతోందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సాగునీరు లేక సాగుభూములన్నీ బీడువారి పోయాయని, వాటిని సాగులోకి తీసుకురావాలంటే తెలివిగా నీటిని మనకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే 155 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దీంతో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌, ఎస్‌అర్‌బీసీ, తెలుగుగంగ, గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీ- నీవా, వెలిగొండ, తదితర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు బీడు భూములుగా మారుతున్నాయని పేర్కొన్నారు. మూడేళ్ల కిందట కర్నూలులో చేపట్టిన జలదీక్షలో నాడు ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన నేటి సీఎం వైఎస్‌ జగన్‌ మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు.


By June 30, 2019 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-leader-tulasi-reddy-sensational-comments-on-ys-jagan-due-to-meeting-with-kcr/articleshow/70008300.cms

No comments