కాళేశ్వరం సందర్శనకు వెళ్లి లిఫ్ట్లో ఇరుక్కున్న మంత్రి జగదీశ్ రెడ్డి!
తెలంగాణలో శుక్రవారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నెర్రలు ఏర్పడిన తెలంగాణ భూములను సశ్యశ్యామలం చేసే ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును ప్రారంభించి జాతకి అంకితం చేశారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో పంప్హౌస్లను మంత్రులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ సమీపంలోని సొరంగంలో ఉన్న పంప్హౌస్ వద్ద తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ పంప్ హౌస్ కాళేశ్వరంలో కీలకమైన ఎనిమిదో ప్యాకేజీలోది. భారీ మోటార్ల వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో చొప్పదండి, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్శంగా చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ వద్ద పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మంత్రి జగదీశ్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి కన్నెపల్లి పంపుహౌస్ సందర్శనకు వచ్చారు. వారితోపాటు జయశంకర్ భూపాలపల్లి ఆర్డీవో, మహదేవపూర్ తహసీల్దార్, గ్రావిటీ కెనాల్ సంస్థ ఎండీ, మరో 10 మంది కలిసి లిఫ్ట్లో పంపుల కింది భాగానికి వెళ్లారు. అక్కడ సందర్శన పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తులోకి రాగానే లిఫ్ట్ ఆగిపోయింది. ఎంతటికీ లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో అక్కడ ఉన్న కార్మికులు ఇంజినీర్లకు సమాచారం అందించారు. వెంటనే మేఘా ఇన్ఫ్రా సిబ్బంది, పోలీసులు వచ్చి లిఫ్ట్ కింది భాగాన్ని పగులగొట్టారు. అద్దాలు పగులగొట్టి అందులోంచి ఒక్కొక్కరిని బయటకు తీసి నిచ్చెనల ద్వారా పైకి పంపించారు. చివరగా మంత్రి జగదీశ్రెడ్డిని బయటకు రప్పించారు. మంత్రి, కుటుంబ సభ్యులు, అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్లో సామర్థ్యానికి మించి ఎక్కడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సాంకేతిక సిబ్బంది తెలిపారు.
By June 22, 2019 at 08:49AM
No comments