Breaking News

మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ హోం మంత్రి .. కాన్వాయ్ ఆపి ప్రమాద బాధితులకు సాయం!


శుక్రవారం సాయంత్రం కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ దుర్గమ్మగడ్డ వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. మానకొండూర్‌ మండలం లక్ష్మిపూర్‌ సర్పంచి తుమ్మల అర్చన కుమార్తెలు హరిణి, శ్రీవాణి తమ కారులో కరీంనగర్‌ నుంచి స్వగ్రామానికి వస్తునాన్రు. వీరు ప్రయాణిస్తోన్న వాహానాన్ని అల్గునూర్‌ దుర్గమ్మ గడ్డ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ కాల్వ సందీప్‌(27) అక్కడికక్కడే మృతిచెందగా హరిణి, శ్రీవాణి గాయపడ్డారు. బస్సులోని ఐదుగురికి కూడా గాయాలయ్యాయి. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన హోం ఆ మార్గంలో వస్తున్నారు. ప్రమాదం గురించి తెలియడంతో తన కాన్వాయ్ ఆపించి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో నుంచి దిగి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్‌ను ఏర్పాటుచేయాలని స్థానిక పోలీసులకు సూచనలు చేశారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించాలని సూచించారు. హోం మంత్రి వెంట కరీంనగర్ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ తదితరులు ఉన్నారు. గతంలోనూ మంత్రి అలీ ఇలాగే ప్రమాద బాధితులకు సాయం అందజేశారు. గత ఆగస్టులో మెయినాబాద్ వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, ఇదే సమయంలో వికారాబాద్ పర్యటనకు వెళ్లిన మహమూద్ అలీ హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన తన కాన్వాయ్ ఆపి బాధితులకు ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్‌కు పంపారు.


By June 22, 2019 at 10:28AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-home-minister-mahmood-ali-stopped-his-convoy-and-helped-accident-victims-in-karimnagar/articleshow/69900546.cms

No comments