Breaking News

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కామాంధుడిని చితకబాదిన స్థానికులు


ఆరేళ్ల బాలికకు చాక్లెట్లు ఆశచూపి అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడిని స్థానికులు చితకబాదిన ఘటన జగద్గిరిగుట్టలో శనివారం చోటుచేసుకుంది. దాడి నుంచి తప్పించుకునేందుకు పారిపోతున్న నిందితుడు కిందపడి తలకు గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పరిధిలోని ఎల్లమ్మబండ సమీపంలోని నివసించే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న భార్యాభర్తలు పిల్లలను ఇంట్లోనే ఉంచి ఉద్యోగాలకు వెళ్తున్నారు. వీరి ఇంటికి సమీపంలో ఉండే మహిపాల్‌రెడ్డి(40) వారి రెండో కుమార్తె(6)పై పడింది. బాలిక పేదరికాన్ని అలుసుగా తీసుకున్న మహిపాల్‌రెడ్డి ఆమెకు చాక్లెట్లు కొనిస్తూ మచ్చిక చేసుకున్నాడు. శనివారం ఆమె ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికకు చాక్లెట్ కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న మహిపాల్‌రెడ్డి తన బంధువులకు చెందిన భవనంలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి రాగా పారిపోయాడు. నిందితుడు సాయంత్రం సమయంలో ఇంటికి రాగా పట్టుకుని చితక్కొట్టారు. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోమే క్రమంలో కింద పడటంతో తలకు గాయమైంది. దీనిపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. కామాంధుడిని అందరి ముందూ శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో పోలీసులు స్పెషల్ ఫోర్స్‌ను రప్పించి నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


By June 30, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/6yr-old-girl-attempt-raped-by-man-in-hyderabad/articleshow/70008273.cms

No comments