Breaking News

పుణెలో వర్ష బీభత్సం... గోడకూలి 17 మంది మృతి


మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన పుణెలో విషాదం చోటుచేసుకుంది. కుంద్వా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఓ అపార్ట్‌మెంట్ గోడ కూలి ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గోడ కూలి శిథిలాలు పక్కనే ఉన్న గుడిసెలు, కార్లు, ఆటోలపై పడటంతో నిద్రలో ఉన్నవారు విగతజీవులుగా మిగిలారు. మృతుల్లో తొమ్మిది పురుషులు, నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరి కొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన కొందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపడుతున్నాయి. జిల్లా కలెక్టర్ కిషోర్ రామ్ సంఘటనా స్థలంలో సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే ఈ దారుణ ఘటన జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మృతులంతా బిహార్, వెస్ట్ బెంగాల్ నుంచి వలస వచ్చిన నిర్మాణ కూలీలేనని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.


By June 29, 2019 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wall-collapse-in-pune-due-to-heavy-rains-14-died/articleshow/69997696.cms

No comments