Breaking News

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లింక్ కంటిన్యూ..


ఒకానొక దశలో వరుస ఫ్లాప్‌లతో డీలా పడిన నేచురల్‌స్టార్‌ నానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంకా, స్వప్నదత్‌లు నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మరలా బ్రేక్‌ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి నాని తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఇదే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నటించిన విజయ్‌ దేవరకొండ తర్వాత అనతి కాలంలోనే రౌడీస్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. విచిత్రంగా ఇప్పుడు దాదాపు ఒకేసమయంలో నాని, విజయ్‌దేవరకొండలు కూడా నిర్మాతలుగా మారారు. 

నాని ప్రశాంత్‌వర్మ అనే యంగ్‌ డైరెక్టర్‌ చెప్పిన కథ నచ్చి వాల్‌పోస్టర్స్‌ బేనర్‌ని స్థాపించిన ‘అ’ చిత్రం నిర్మించాడు. నాని నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ చిత్రంలో పలువురు పేరున్న నటీనటులు నటించారు. ఇక నాని తన ద్వితీయ ప్రయత్నంగా మరో చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ‘పిట్టగోడ’ ఫేమ్‌ అనుదీప్‌ చెప్పిన స్టోరీ నానిని బాగా మెప్పించిందట. ఇదే కథ స్వప్నదత్‌ని కూడా మెప్పించడంతో ఈ తాజా చిత్రాన్ని నానితో పాటు స్వప్నాదత్‌ కూడా కలిసి నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఇందులో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, షాలినిపాండే, నవీన పోలిశెట్టి ముఖ్యపాత్రలను చేయనున్నారు. 

స్వప్న బేనర్‌లో స్వప్న కూడా అభిరుచి కలిగిన చిత్రాలు తీస్తూ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటోంది. ఈమె నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో పాటు ‘మహానటి’ బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఒకే కథతో ఇద్దరు ఇంటెలిజెంట్‌ వ్యక్తులైన నాని, స్వప్నలను మెప్పించాడంటే ‘పిట్టగోడ’ ఫేమ్‌ అనుదీప్‌ చెప్పిన స్టోరీలో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏదో ఉందనే భావించాల్సివుంటుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్‌ షూటింగ్‌ని ఈ ఏడాది ద్వితీయార్దంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మరి నాని, స్వప్నలు కలిసి ఎలాంటి మేజిక్‌ చేస్తారో వేచిచూడాల్సివుంది.



By April 25, 2019 at 07:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45666/yevade-subrahmanyam.html

No comments