Breaking News

గంగానదిలో మృతదేహాలు కొట్టుకురావడం నిజమే.. కానీ మా దగ్గర వివరాలు లేవు : కేంద్రం


కోవిడ్ సెకండ్ వేవ్‌లో గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం సంచలనం సృష్టించింది. మృతి చెందిన కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే దానిని అప్పట్లో అధికారులు కొట్టిపారేశారు. తాజాగా ఈ విషయం రాజ్య సభలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓ బ్రియన్ రాజ్య సభలో ప్రశ్నించారు. నదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయి...? వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అని అడిగారు. దీనిపై స్పందించిన కేంద్రం తమ వద్ద లేవని సమాధానం చెప్పింది. యూపీ, బీహార్ గుండా ప్రవహించే గంగానదిలో గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకురావడం నిజమేనని, వాటికి సంబంధించిన నివేదికలు అందజేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశామని, కానీ ఆ వివరాలు తమ వద్ద లేవని కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు రాతపూర్వకంగా చెప్పారు. అయితే కేంద్రం ఇచ్చిన ఈ సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని, అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఒక టైంలో బీహార్‌లోని బక్సర్ జిల్లా చౌసా బ్లాక్‌లో ఓ దహన వాటికి దగ్గర 40 మృతదేహాలు పడి ఉన్నాయనే వార్తలు వచ్చాయి. 30 నుంచి 40 మృతదేహాలు గంగానదిలో గుర్తించినట్టు, ఆ మృతదేహాలు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే శవాలు కొట్టుకురావడంతో గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ నీటిని ఉపయోగిస్తే కరోనా వైరస్‌ సోకుతుందన్న అనుమానాలు వెల్లువెత్తాయి.


By February 08, 2022 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-data-on-dumped-bodies-in-ganga-river-during-covid-second-wave-says-centre/articleshow/89418239.cms

No comments