Breaking News

జూన్‌లో ఫోర్త్ వేవ్.. ఆగస్టులో గరిష్ఠానికి: ఐఐటీ కాన్పూర్ అంచనా


దేశంలో కోవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుతూ రోజువారీ కేసులు పదివేలకు దిగివచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో థర్డ్ వేవ్‌లు కేసులు భారీగా నమోదయినా.. ఇన్‌ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో చేరిక, మరణాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యా. మూడో వేవ్‌లో తీవ్రత అంతగా లేకపోవడంతో ఊరట కలిగించింది. అయితే, మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, మరిన్ని కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌‌కు ముప్పు పొంచి ఉందని తాజాగా ఓ అధ్యయనం అంచనా వేసింది. నాలుగో వేవ్‌పై కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు కీలక విషయాలను వెల్లడించారు. జూన్‌లో కొవిడ్‌ నాలుగో వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. జూన్‌ 22 న నాలుగో వేవ్ ప్రారంభమై.. అక్టోబర్‌ 24 వరకు కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రతపై ఇప్పుడే చెప్పలేమని, కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీప్రింట్ సర్వర్ MedRxivలో ఇటీవలే ప్రచురితమైంది. ఫోర్త్‌ వేవ్‌ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని, ఆగస్టు 15 నుండి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వివరించింది. గతంలో అంచనా వేసినట్టుగానే కరోనా వ్యాప్తి కొనసాగింది. మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్‌ కేసులు, పీక్‌ టైమ్‌, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే నిర్లక్ష్యం వద్దని, ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ‘భారత్‌లో నాలుగో దశ జూన్‌ 22న మొదలై, ఆగస్టు 15 నుంచి 31 మధ్య పీక్‌ స్టేజ్‌కి చేరుతుంది.. అక్కడ నుంచి కేసులు తగ్గి అక్టోబర్‌ 24న ముగియనుందని అంచనా’ అని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ అధ్యయనానికి ‘బూస్ట్‌స్ట్రాప్’ అనే పద్ధతిని పరిశోధకులు ఉపయోగించారు. దీని ద్వారా ఇతర దేశాల్లో రాబోయే వేవ్‌లను కూడా అంచనా వేయొచ్చని తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన సబారా పర్షద్ రాజేశ్‌భాయ్, సుభార శంకర్ ధార్, శలభ్‌లు ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలో కరోనా మొదలైన 936 రోజుల (జనవరి 30, 2020న తొలి కేసు నమోదు) తర్వాత నాలుగో వేవ్ వస్తుందని అంచనా వేశారు. ‘‘చాలా దేశాలు ఇప్పటికే మూడో వేవ్‌ను ఎదుర్కొగా.. కొన్ని దేశాల్లో నాలుగో వేవ్ మొదలయ్యింది.. దేశంలో మూడో వేవ్‌పై జింబాబ్వే డేటా ఆధారంగా గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ మిశ్రమం భావనను ఉపయోగించి అంచనా వేశాం.. భారత్‌లో మూడో వేవ్ పూర్తవుతున్న సూచన దాదాపు మా అంచాన సరైందని ఇప్పుడు స్పష్టమైంది. దీని ఆధారంగా నాలుగో వేవ్ అంచనాను పరిశోధించాం’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.


By February 28, 2022 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iit-kanpur-experts-predict-covid-4th-wave-around-june-22-in-india/articleshow/89882862.cms

No comments