Breaking News

మతమా? దేశమా? ఏది సర్వోన్నతం: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు


కర్ణాటకలో హిజాబ్ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ పిల్‌పై యాక్టింగ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ భండారీ, జస్టిస్ డి.భరత్‌ చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్న ధోరణులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దేశమా? మతమా.. ఏది అత్యున్నతమైందంటూ ప్రశ్నించింది. ‘‘దేశంలో కొన్ని శక్తులు డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని... ఇది దేశమంతా వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తంచేసింది. ‘‘ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. ఒకరు 'హిజాబ్' కోసం, మరికొందరు కండువా కోసం.. ఇంకొందరు ఇతర అంశాల కోసం వెళ్తున్నారు.. ఇది ఒక దేశమా లేదంటే మత ప్రాతిపదికన విభజించబడిందా? జరుగుతున్న పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి’’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారత్ లౌకిక దేశమనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్న సీజే జస్టిస్ట్ భండారీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. పిల్ దాఖలు చేసిన తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్‌ నరసింహన్‌ అనే వ్యక్తి.. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. అలాగే, దేవాలయాల్లోకి హిందూయేతరులు ప్రవేశాన్ని, దేవాలయాల ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలను నిషేధించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థించారు. దీంతో పాటు ప్రవేశ ద్వారం వద్ద అన్యమతస్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ, డ్రెస్‌ కోడ్‌ను నిర్దేశిస్తూ డిస్‌ప్లే బోర్డులను సైతం ఏర్పాటు చేసేలా తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్ లేనప్పుడు వాటిని డిస్‌ప్లే బోర్డులు పెట్టడమెలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అయితే, పిటిషనర్‌ తీర్పు కోసం పట్టుబట్టడంతో అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం సూచించింది. ప్యాంటు, ధోతీ, చొక్కాలను ధరించాలని ఏ ఆగమ శాస్త్రం సూచిస్తోందని ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ ధోరణిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ షణ్ముగసుందరం.. ఒక్కో దేవాలయం ఒక్కో ఆచారాన్ని అనుసరిస్తోందని, ఇతర మతాలకు చెందినవారిని ‘ధ్వజ స్తంబం’వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఆలయాల్లో డ్రెస్‌ కోడ్‌ను నిర్దేశిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టు పక్కనపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇది ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోందని కోర్టుకు వివరించారు. అయితే, ధర్మాసనం మాత్రం డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన ఆధారాలను పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలకు పిటిషనర్‌కి అనుమతించింది.


By February 11, 2022 at 07:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/what-is-paramount-country-or-religion-asked-by-madras-high-court/articleshow/89491382.cms

No comments