Breaking News

Big Breaking ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్టు పుతిన్ ప్రకటన


ప్రపంచ దేశాలు భయపడిందే జరిగింది. కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌పై దాడికి సన్నాహాలు చేపట్టిన రష్యా.. ఎట్టకేలకు తన వ్యూహాన్ని అమలు చేసింది. తూర్పు ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పరోక్షంగా అమెరికా సహా నాటో దేశాలకు పుతిన్ హెచ్చరికలు పంపారు. ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సైనిక ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. జాతినుద్దేశించిన ప్రసంగించిన వ్లాదిమిర్ పుతిన్.. అలాగే, ఉక్రెయిన్ వేర్పాటువాదులు లొంగిపోవాలని సూచించారు. బెదిరింపులను రష్యా ఎప్పుడూ సహించబోదని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను ఎన్నడూ రష్యా స్వాధీనం చేసుకోబోదని పుతిన్ పేర్కొన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్‌ పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రష్యా చర్యల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే గతంలో ఎన్నడూ చూడనిస్థాయిలో పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోరాదన్న తమ డిమాండ్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు విస్మరించాయని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ చర్యకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే వారిని సురక్షితంగా పంపుతామని హామీ ఇచ్చారు. ఆయుధాలను వదిలిన సైనికులకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వేర్పాాటువాద ప్రాంతాల్లో పౌరుల రక్షణకే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్ దురాక్రమణను ఆపడానికి సహాయం కోసం రష్యా అనుకూల వేర్పాటువాదులు మాస్కోను అభ్యర్ధించిన కొన్ని గంటల్లో మిలటరీ ఆపరేషన్‌కు పుతిన్ ఆదేశాలు జారీచేయడం గమనార్హం. అక్కడ ప్రజలను రక్షించాలని, ఉక్రెయిన్ దళాలపై దాడిచేయాలని రష్యా సైన్యానికి సూచనలు చేశారు. కాగా, మిలటరీ ఆపరేషన్‌పై పుతిన్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం బోరిస్పిల్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా తెలిపినట్టు ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా దుందుడుకు చర్యల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయ్యింది. మూడు రోజుల వ్యవధిలో సమావేశం కావడం రెండోసారి. ఈ సమావేశానికి వివిధ సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అటు, రష్యా చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్‌పై అన్యాయంగా దాడికి యత్నిస్తున్న రష్యాకు అమెరికా, దాని మిత్రదేశాలు తగిన గుణపాఠం చెబుతాయని అన్నారు. పుతిన్ ముందస్తుగానే నిర్ణయించుకుని యుద్ధానికి దిగారని ఆరోపించారు. నాటో కూటమికి తమ సహకారం ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు. పుతిన్ చర్య తీవ్రమైన విపత్తు.. మానవాళి నష్టానికి దారితీస్తుందన్నారు. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలను గమనిస్తున్నామన్న బైడెన్.. శుక్రవారం జీ-7 దేశాల కూటమి నేతలతో సమావేశమవుతానని తెలిపారు. ఇదిలా ఉండగా, రష్యా సైనికులు డొనెట్స్క్‌ నుంచి ఉక్రెయిన్‌లోని నిప్రో, జపోరి ఝాఝియాలకు చొచ్చుకువెళ్లే అవకాశముందని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నిపుణులు భావిస్తున్నారు.ఇక రష్యాలోని రొస్తోవ్‌-ఆన్‌-డాన్‌ నుంచి ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు, చొరబాట్లకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే వందల మంది సైనికులు మోహరించిన బెల్గరొడ్‌లోని సరిహద్దు ప్రాంతం నుంచి క్రెమెన్‌చుక్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చు.


By February 24, 2022 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-president-vladimir-putin-announces-military-operation-in-ukraine/articleshow/89789057.cms

No comments