Breaking News

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు.. వ్యాట్‌ను తగ్గించిన ఆ 9 రాష్ట్రాలు


దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు దీపావళి పండుగ వేళ కేంద్రం తీపి కబురు అందించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఇదిలా ఉండగా, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు ఎక్సైజ్ సుంకానికి అదనంగా ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. అసోం, త్రిపుర, మణిపుర్, కర్ణాటక, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు లీటర్ పెట్రోల్, డీజిల్‌కు రూ.7 తగ్గించగా... ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రెండింటిపై లీటర్‌కు రూ.2 వ్యాట్ తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సైతం త్వరలోనే వ్యాట్ తగ్గింపుపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. గుజరాత్, బిహార్ రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు పేర్కొన్నాయి. ‘త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కొనసాగింపుగా వ్యాట్‌ను రూ.7 తగ్గించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది.. ఇది గురువారం నుంచి అమల్లోకి రానుంది’అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో కూడా రైతులు తమ కష్టార్జితంతో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించారనీ, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడం వల్ల రాబోయే రబీ సీజన్‌లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తే వినియోగదారులకు మరింతగా ఊరటగా ఉంటుందని కేంద్రం కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు గతంలో ఎన్నడూ లేనంత భారీగా పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.120కు సమీపించింది. అలాగే, డీజిల్ కూడా రూ.100 దాటేసింది. బుధవారం దేశ రాజదాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.110.4 ఉండగా.. డీజిల్ ధర రూ.98.42గా ఉంది. ఇకపోతే, ముంబయి మహానగరంలో లీటరు పెట్రోల్‌ ధర ₹115.85, డీజిల్‌ ధర ₹106.62గా ఉంది.


By November 04, 2021 at 07:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nine-bjp-ruled-state-govt-announce-additional-slashes-vat-in-fuel-rates/articleshow/87519317.cms

No comments