Breaking News

Pegasus‌ దర్యాప్తునకు సుప్రీం కమిటీ.. ఇజ్రాయేల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు


పెగాసస్‌ స్పైవేర్‌ అంశం భారత అంతర్గత వ్యవహారమని.. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. పెగాసస్ గూఢచర్యంపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీని నియమిస్తూ తీర్పు నేపథ్యంలో ఇజ్రాయేల్ రాయబారి నవోర్‌ గిలన్‌ మీడియాతో మాట్లాడారు. పెగాసస్ స్పైవేర్‌ను దుర్వినియోగం చేసి పలువురిపై నిఘా ఉంచారన్న ఆరోపణలపై మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్‌ఎస్‌ఓ లాంటి కంపెనీ ఉత్పత్తులను ప్రభుత్వేతర విభాగాలకు విక్రయించడాన్ని ఇజ్రాయెల్‌ అనుమతించదని పేర్కొన్నారు. అలాగే, సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన స్వతంత్ర దర్యాప్తు కమిటీకి ఇజ్రాయేల్ ప్రభుత్వం లేదా ఎంబసీ సహకరిస్తుందా? అన్న ప్రశ్నకు గిలన్ బదులిస్తూ.. ఎన్‌ఎస్‌వో గ్రూపు ఒక ప్రైవేటు సంస్థని, అది ఎగుమతి చేసే ప్రతి ఉత్పత్తికీ తమ ప్రభుత్వం అనుమతి తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంత కంటే ఎక్కువ వివరాలను వెల్లడించలేమని చెప్పారు. ‘ఇక్కడ ఏం జరుగుతుందో అది నిజంగా భారత్ అంతర్గత వ్యవహారం... ఇందులో మేం వేలు పెట్టలేం’ అని గిలన్ ఉద్ఘాటించారు. అమెరికా, భారత్, ఇజ్రాయేల్, యూఏఈలు కొత్త కూటమిగా ఏర్పడ్డాయి కదా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘కేవలం ఆర్ధిక, వాణిజ్య, మౌలికవసతులు, సాంకేతిక సహ ఇతర అంశాలపైనే సహకరించుకుంటాయి.. సైనికపరమైన విషయాలు కాదు’ అని తెలిపారు. ‘ఆఫ్గనిస్థాన్, ఇరాన్ విషయానికి వస్తే భారత్ దాని స్వంత ప్రయోజనాలను కలిగి ఉందని మాకు బాగా తెలుసు... దేశాల మధ్య, ముఖ్యంగా స్నేహితుల మధ్య చర్చలలో, ప్రతి దేశం దాని స్వంత ఆందోళనలను ముందుకు తెస్తుంది.. ప్రతి దేశానికి దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి.. కాలక్రమేణా ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అని అన్నారు. మరోవైపు.. పెగాసస్‌ నిఘాపై విచారణకు స్వతంత్ర నిపుణులను ఖరారుచేయడం చాలా కష్టతరమైందని.. చాలా మంది సున్నితంగా తిరస్కరించారు. ఇంకొందరు వ్యక్తిగత కారణాలు చూపారని సుప్రీంకోర్టు పేర్కొనడం తనను ఆందోళనకు గురిచేసిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు.


By October 29, 2021 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pegasus-snoop-israeli-envoy-naor-gilon-says-it-is-indias-internal-matter/articleshow/87355316.cms

No comments