Cyclonic Storm తీవ్ర తుఫానుగా మారిన షహీన్.. ఏడు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/86699921/photo-86699921.jpg)
గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను నుంచి తూర్పు తీరం తేరుకునేలోపే అరేబియా సముద్రంలో మరో తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారినట్టు భారత వాతవరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుఫానుకు షహీన్ అనే పేరును సూచించారు. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. పశ్చిమ- వాయువ్యంగా గుజరాత్లోని దేవ్భూమి ద్వారకకు 700 కి.మీ., తూర్పు-నైరుతిగా ఇరాన్లో చాబర్ పోర్టకు 240కి.మీ., మస్కట్కు తూర్పు- ఈశాన్యంగా 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా మక్రాన్ తీరంవైపు ప్రయాణించి.. తర్వాత దిశ మార్చుకుని పశ్చిమ-నైరుతి దిశలో ఒమన్ తీరంవైపు ప్రయాణించి క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. అక్టోబరు 4 తెల్లవారుజామున ఒమన్ వద్ద తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేసింది. షహీన్ ప్రభావం భారత్ పశ్చిమ తీరంలోని ఏడు రాష్ట్రాలపై ఉంటుందని హెచ్చరించింది. అక్టోబరు 4 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కారణంగా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తీవ్ర తుపానుగా మారిన షహీన్.. పాకిస్థాన్లోని మక్రన్ తీర ప్రాంతాన్ని తాకనుంది. అనంతరం 36 గంటల్లో దిశ మార్చుకుని గల్ఫ్ ప్రాంతాలవైపుకు కదిలి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ ()వెల్లడించింది. తుఫాను తీరం దాటిన తర్వాత వాయుగుండంగా మారుతుందని వివరించింది. గులాబ్ తుఫాను కారణంగానే షహీన్ ఏర్పడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటలకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. శని, ఆదివారాలు రెండు రోజులూ గాలుల వేగం 130 కి.మీ. వరకూ అంటుందని పేర్కొంది. తుఫాను క్రమంగా బలహీనపడి అక్టోబరు 4 నాటికి తీరం దాటనుంది.
By October 02, 2021 at 09:57AM
No comments