చీర కట్టుకుని వచ్చిన మహిళను అవమానించిన రెస్టారెంట్.. షాకిచ్చిన అధికారులు
చీర కట్టుకుని వచ్చినందకు మహిళకు ప్రవేశాన్ని నిరాకరించి వార్తల్లో నిలిచిన ఢిల్లీ రెస్టారెంట్కు అధికారులు షాకిచ్చారు. దక్షిణ ఢిల్లీలోని అక్విల్ రెస్టారెంట్కు నోటీసులు జారీచేసిన సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ).. మూసేయాలని ఆదేశించింది. ఆండ్రూస్ గంజ్లోని అన్సల్ ప్లాజా వద్ద ఉన్న అక్విల్ రెస్టారెంట్ను తగిన అనుమతులు లేకుండా నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 21న పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లి పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్ నడుపుతున్నారని, ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎస్డీఎంసీ తన నోటీసులో పేర్కొంది. ‘పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ మరోసారి కూడా రెస్టారెంట్కు వెళ్లారు.. పరిస్థితుల్లో మార్పు లేదని గుర్తించారు. ఆ దృష్ట్యా 48 గంటల్లో వ్యాపారం నిలిపివేయాలని ఆదేశిస్తున్నాం.. ఆదేశాలను పాటించని పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే రెస్టారెంట్ను సీల్ చేయడంతో సహా తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఎస్డీఎంసీ’ ఆ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా, మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలతో రెస్టారెంట్ మూసేస్తున్నట్టు యజమాని వెల్లడించారు. చీర కట్టుకుని వెళ్లినందుకు రెస్టారెంట్లోకి తనను అనుమతించ లేదంటూ బాధిత మహిళ పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చీర స్మార్ట్, క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదని సిబ్బంది తనతో అన్నట్టుగా ఆ మహిళ తెలిపింది. ‘కనీసం రెస్టారెంట్లో కూడా నన్ను కూర్చోనీయలేదు. ఎందుకంటే...భారత్లో అత్యంత సంప్రదాయమైన చీర మన ఇండియా, భారత్, హిందుస్థాన్లో స్మార్ట్ ఔట్ఫిట్ కాకపోవడమేనట’ అని ఆ మహిళ వాపోయింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఎస్డీఎంసీ సమావేశంలో ఆండ్రూస్ గంజ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. చీర కట్టుకుని వచ్చిన మహిళను అనుమతించని ఆ రెస్టారెంట్కు రూ.5 లక్షలు జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రెస్టారెంట్ను నడుపుతున్నారని అభిషేక్ ఆరోపించారు.
By September 30, 2021 at 09:42AM
No comments