Breaking News

ఫ్రీ కరెంట్ వద్దు.. మీరే కావాలన్న యువతి.. యువ ఎమ్మెల్యే ఛమత్కారంగా రిప్లై


వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తాయిలాలను ప్రకటిస్తున్నాయి. పంజాబ్‌లో పాగా వేయాలని భావిస్తోన్న ఆప్.. ఉచిత విద్యుత్‌ను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌ కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలని ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఓ యువతి స్పందించింది. ‘నాకు ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలి’అని ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ రాఘవ్‌ చద్దా దృష్టిని ఆకర్షించడంతో ఉచిత విద్యుత్‌కు బదులుగా తననే కోరుకున్న ఆమెకు తెలివిగా సమాధానం ఇచ్చారు. ‘పార్టీ మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్‌ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్‌లో ఆప్‌ అధికారం చేపట్టాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్‌ సరఫరా అయ్యేట్టు చూస్తాలే’ అంటూ యువతికి చమత్కారంగా బదులిచ్చారు. అయితే ఆ యువతి ట్వీట్‌ను కొద్దిసేపటి తర్వాత తొలగించగా.. రాఘవ్‌ స్క్రీన్‌షాట్‌ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, దీని వల్ల పంజాబ్‌లోని 77 నుంచి 80 శాతం ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, 24 గంటల నిరంతరాయం కరెంట్‌ను మూడేళ్లలో నెరవేరుస్తామని హామీ కేజ్రీవాల్ ఇచ్చారు.


By August 01, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-aap-mla-raghav-chadhas-savage-reply-to-woman-saying-she-wants-him/articleshow/84938906.cms

No comments