Breaking News

రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలపై మార్షల్స్ బలప్రయోగం.. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన కేంద్రం


రాజ్యసభలో జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును ఆమోదించే సమయంలో నిరసన తెలుపుతున్న తమ సభ్యులపై బలప్రయోగం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, దీనిని కొట్టిపారేసిన అధికార పార్టీ.. వారివన్నీ నాటకాలని ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం రాజ్యసభలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తం రెండున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ప్రతిపక్ష సభ్యులు, మార్షల్స్‌ మధ్య తోపులాట కనిపించింది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తుండగా.. యూనిఫాంలో ఉన్న మార్షల్స్‌ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక సభ్యుడు టేబుల్‌పైకి ఎక్కుతూ కనిపించారు. బయటి వ్యక్తులను సభలోకి తీసుకొచ్చి దాడి చేయించారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న వేళ ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. పార్లమెంటు భద్రతా విధులతో సంబంధం లేని వారిని తీసుకొచ్చి.. మహిళా ఎంపీలని కూడా చూడకుండా ప్రతిపక్ష సభ్యులందరిపైనా దాడి చేయించారని రాహుల్‌ ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌, మల్లికార్జున ఖర్గే, సంజయ్‌ రౌత్‌, తిరుచ్చి శివ, మనోజ్‌ ఝా తదితర నేతలు పార్లమెంటు వెలుపల నిరసన తెలియజేశారు. అనంతరం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశారు. పార్లమెంటులో ప్రజా గొంతకను నొక్కేశారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాహుల్‌ దుయ్యబట్టారు. ఎంపీలపై మార్షల్స్‌ చేయి చేసుకున్నారని, పార్లమెంటరీ ప్రతిష్ఠకు ఇంతటి అవమానం ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే, మహిళా ఎంపీలపై దాడి జరిగిందనడం అబద్దమని, ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తిప్పికొట్టారు. కాగా, రాజ్యసభలో జరిగిన ఘటనలపై అటు ప్రతిపక్షం, ఇటు అధికారపక్షం నేతలు ఛైర్మన్ వెంకయ్యను కలసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అటు ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభలో బీజేపీ పార్లమెంటరీ పక్షనేత పియూష్ గోయల్ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ టేబుల్‌‌పైకి ఎక్కిన ప్రతిపక్ష సభ్యులు.. గేట్‌ను పగలుగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కిటికీ అద్దం పగిలిపోయిందని, మహిళా మార్షల్స్ గాయపడ్డారని అన్నారు. టేబుల్‌పై ఫైల్స్‌ను తోసేశారని తెలిపారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశామని, గలాటా సృష్టించిన ప్రతిపక్ష ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు.


By August 13, 2021 at 07:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/government-slams-opposition-for-violence-in-rajya-sabha-over-general-insurance-bill/articleshow/85290906.cms

No comments