Breaking News

కశ్మీర్‌లో మరో విజయం..హిజ్బుల్ టాప్ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతం!


జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలకు మరో భారీ విజయం దక్కింది. 24 గంటల వ్యవధిలోనే ఐదుగురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. కుల్గామ్, పుల్వామా వద్ద జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. వీరిలో లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులున్నట్టు తెలిపారు. కశ్మీర్‌లో బుర్హాన్‌ వానీ తర్వాత ఆ స్థాయి పేరున్న హిజ్బుల్ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అలియాస్ ఉబెయిద్ అనుకోకుండా భద్రతా బలగాలకు చిక్కి హతమయ్యాడు. ఉబెయిద్ ఆచూకీ కోసం 2013 నుంచి సైన్యం వెతుకుతోంది. అయితే, మంగళవారం అతడు అనుకోకుండా రోడ్డుపై తారసపడ్డాడు. ఇంటరాగేషన్‌లో తన స్థావరం చూపిస్తానని భద్రతా దళాలను నమ్మించి హంద్వారాలోని ఓ చోటకు తీసుకెళ్లాడు. అక్కడ దాచిపెట్టిన ఆయుధాన్ని తీసి కాల్పులు జరపడంతో దళాలు ఎదురుకాల్పులు జరిపి హతమార్చాయి. ఇటీవల కాలంలో కశ్మీర్‌లోని దళాలకు లభించిన అతిపెద్ద విజయంగా ఐజీపీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కుల్గామ్ జిల్లా జోదర్ వద్ద భద్రత బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమ్యారు. పుల్వామాలోనూ బుధవారం తెల్లవారుజామున ఇద్దరు ముష్కరులను కాల్చి చంపారు. హంద్వారా వద్ద పోలీసులు, సశస్త్రసీమాబల్‌, ఇతర దళాలు మంగళవారం కొవిడ్‌-19 నిబంధనల అమలు విషయంలో తనిఖీలు నిర్వహించాయి. ఒక చోట చాలా వాహనాలు ఉండగా.. సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని గుర్తించాయి. వెంటనే అతడి అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా.. ఒక గ్రెనేడ్‌ దొరికింది. తర్వాత సమీపంలోకి పోలీస్‌ పోస్టుకు తరలించి విచారించారు. అతడు ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న హిజ్బుల్‌ కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ హల్వాయిగా ధ్రువీకరించారు. ఇంటర్ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో డిప్లోమా చేసిన మెహ్రాజుద్దీన్... టెక్నాలజీ వినియోగంలో సిద్ధహస్తుడు. 2011లో ఉగ్రవాదిగా మారిన హల్వాయి.. టెక్నాలజీని వాడుకొని పోలీసుల నుంచి తప్పించుకొనేవాడు. అతడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో కొన్నాళ్లు పాకిస్థాన్‌లో తలదాచుకొని వచ్చాడు. ఇక దక్షిణ కశ్మీర్లో బుర్హాన్‌ వానీ మాదిరిగానే మెహ్రాజుద్దీన్‌ ఉత్తర కశ్మీర్‌లో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తుంటాడు. అతడిని పోలీసులు ఏ++ కేటగిరి ఉగ్రవాదిగా ప్రకటించారు. కశ్మీర్‌లో టాప్‌ 10 ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు.


By July 08, 2021 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-includes-top-hizbul-terrorist-mehrazuddin-killed-in-separate-encounters-in-kashmir/articleshow/84225620.cms

No comments